Ganta Srinivasa Rao : గంటా శ్రీనివాస్ ఒంగోలు నుంచి పోటీ చేయబోతున్నారా? ఊహకే అందని విషయం ఇది. చంద్రబాబు కుప్పం వదిలేస్తారంటే నమ్మొచ్చేమో. జగన్ పులివెందుల నుంచి పోటీ చేయరంటే నమ్మొచ్చేమో. కాని గంటా శ్రీనివాస్ విశాఖ వదిలి రావడం అసంభవం. మరి ఎందుకని ఈ టాక్ నడుస్తోంది. నిజానికి గంటా శ్రీనివాస్ ఒక నియోజకవర్గానికే పరిమితం అయిన వ్యక్తి కాదు. విశాఖలోనే నియోజకవర్గాలు మారుతూ పోటీ చేస్తూ వచ్చారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే.. ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్తను ఓ సెక్షన్ నమ్ముతోంది. ఇంతకీ ఇందులో నిజం ఎంత?
నిప్పులేనిదే పొగ రాదంటారు. గంటా శ్రీనివాస్ విశాఖ వదలేసి ఒంగోలుకు షిఫ్ట్ అవుతున్నారన్న దానిపై ఒక్క టీడీపీలోనే కాదు అధికార వైసీపీలోనూ డిస్కషన్ జరుగుతోంది. గంటా ఈసారి నియోజకవర్గాన్ని మారుస్తారట, ఒంగోలు వెళ్లిపోతారట అని మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ ప్రతిపాదన టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిందా లేక గంటా శ్రీనివాస్ నుంచి వచ్చిందా అన్నది క్లారిటీ రాలేదు. ఓ సెక్షన్ చెబుతున్నది ఏంటంటే.. గంటా శ్రీనివాసే ఒంగోలును ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో అది అంత ఈజీ కాదనే టాక్ కూడా నడుస్తోంది. ఒకవేళ ఒంగోలు నుంచి పోటీ చేస్తానన్నా ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నారు. ఆల్రడీ ఎప్పటి నుంచో అక్కడ లీడర్లు పాతుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలుకు మరొకరిని రానిచ్చే పరిస్థితి లేదు. అయితే, అసలు ప్రశ్న ఏంటంటే.. ఇంతకీ గంటా శ్రీనివాస్ విశాఖ జిల్లాను ఎందుకు వదిలేయాలని అనుకుంటున్నారు?
గంటా శ్రీనివాస్ హోమ్ టౌన్ ఒంగోలు జిల్లా కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు. అక్కడే పుట్టి, అక్కడే చదువుకున్నారు. బిజినెస్ అండ్ పాలిటిక్స్ కోసం విశాఖలో సెటిల్ అయిపోయారు. అందుకే, మళ్లీ హోమ్ టౌన్కి వెళ్లాలనుకుంటున్నారా లేదా అధిష్టానమే పంపించాలనుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. బట్.. ఒంగోలు ఎంపీ స్థానానికి గంటా శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారనే టాక్ మాత్రం గట్టిగా నడుస్తోంది. ఒంగోలు నుంచి పోటీ చేస్తే కాపు కమ్యూనిటీతో పాటు లోకల్స్ కూడా గంటాకు గట్టి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందని మాట్లాడుకుంటున్నారు.