Vijay Sethupathi News : ఈరోజుల్లో ఒక భాషకు చెందిన నటుడు.. మరో భాషలో నటించకూడదు అన్న రూల్ ఏమీ పెట్టుకోవడం లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరించడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. అందుకే ప్రతీ భాషా ప్రేక్షకులను మెప్పించడం కోసం హీరోలు కూడా తమ కంఫర్ట్ భాషను దాటి సినిమాలను ఒప్పుకుంటున్నారు. అలాంటి కొంతమంది నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఇప్పుడు విజయ్ సేతుపతి చేతిలో చాలా సినిమాలు ఉండడంతో పాటు బాలీవుడ్లో డెబ్యూకు సిద్ధమవుతున్నారు.
తమిళంలో నటుడిగా గుర్తింపు అందుకున్న విజయ్ సేతుపతి.. హీరోలుగా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. నటుడిగా తనకు సినిమాలో ప్రాధాన్యత ఉందా లేదా అని మాత్రమే ఆలోచించే ఈ మక్కల్ సెల్వన్.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా నటించడానికి కూడా వెనకాడరు. ఇప్పటికే తమిళంతో పాటు మలయాళం, తెలుగులో కూడా ఈ హీరో డెబ్యూ అయిపోయింది. ఇక ఇప్పుడు హిందీలో హీరోగా డెబ్యూ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘ఫార్జీ’ అనే హిందీ సిరీస్లో పోలీస్ ఆఫీసర్గా నటించి అక్కడి ప్రేక్షకులను పలకరించారు.
ఫార్జీ సిరీస్లో ఫ్రెండ్లీ పోలీస్గా విజయ్ సేతుపతి చేసిన పాత్ర హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ ఫార్జీ కంటే ముందే ‘మెర్రీ క్రిస్ట్మస్’ అనే హిందీ సినిమాను సైన్ చేశారు సేతుపతి. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం చివరిదశకు చేరుకుందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా సీనియర్ బ్యూటీ కత్రినా కైఫ్ నటిస్తోంది. వీరితో పాటు మరెందరో సీనియర్ నటులు కూడా ఈ చిత్రంలో ఉండగా.. తాజాగా మరో హీరోయిన్ను కూడా ఇందులో యాడ్ చేసినట్టు తెలుస్తోంది.
తెలుగులో హీరోయిన్గా పరిచయమయ్యి.. బాలీవుడ్కి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రాధికా ఆప్టే. ఇక ఓటీటీ అనేది విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్న తర్వాత.. ఓటీటీ కంటెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ఓటీటీలో నేరుగా విడుదలయ్యే ఎన్నో సినిమాల్లో తను హీరోయిన్గా నటించింది. ఇప్పుడు విజయ్ సేతుపతి నటిస్తున్న మెర్రీ క్రిస్ట్మస్లో కూడా రాధిక ఒక కీలక పాత్ర పోషించనుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ క్యారెక్టర్ను సర్ప్రైజ్ లాగా ఉంచాలని మూవీ టీమ్ భావిస్తోందట.