Indigo : ఇండిగో విమానం భారత్ నుంచి పాకిస్థాన్ లోకి వెళ్లిపోయింది. అమృత్సర్ నుంచి అహ్మదాబాద్కు బయలుదేరిన ఈ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పింది. దీంతో పాక్ గగనతలంలోకి ప్రవేశించింది. లాహోర్ సమీపంలోని గుజ్రాన్వాలా వరకు ఇండిగో విమానం ప్రయాణించింది. అలా 30 నిమిషాల పాటు పాక్ లో తిరిగింది. ఆ తర్వాత సురక్షితంగా భారత్ గగనతలంలోకి తిరిగి చేరింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ వెల్లడించింది.
విమాన రాడార్ వివరాల ప్రకారం.. భారత్ కు చెందిన ఇండిగో విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు ఉత్తర లాహోర్ ప్రాంతంలోకి ప్రవేశించింది. అయితే 30 నిమిషాల తర్వాత తిరిగి రాత్రి 8 గంటలకు భారత్ గగన తలంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో అమృత్సర్ ఏటీసీ టెలిఫోన్ ద్వారా పాకిస్థాన్తో సమన్వయం చేసుకుంది. అలాగే విమాన సిబ్బంది ఆర్-టీ ద్వారా పాకిస్థాన్ ఏటీసీ అధికారులతో సంభాషించారు. చివరికి విమానం అహ్మదాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
సివిల్ ఏవియేషన్ అథారిటీ.. సీఏఏకు చెందిన సీనియర్ అధికారి ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయని తెలిపారు. విమానంలో భారత్ లో సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.