Jagananna vidya kanuka kit details(Andhra Pradesh today news) : ఏపీలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పంపిణీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న 43,10,165 మంది విద్యార్థులకు విద్యాకానుక అందించనుంది. ఇందుకోసం రూ. 1,042.53 కోట్ల ఖర్చు చేసింది. విద్యాకానుక కిట్ల పంపిణీని సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభిస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, కుట్టు కూలితో సహా 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగు అందిస్తారు. 1–5 తరగతి చిన్నారులకు పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తారు. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని బడులు తెరిచిన తొలిరోజే చేపడుతున్నారు.
ప్రతి విద్యార్థికీ రూ.2,400 విలువైన విద్యా కానుక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ వస్తువుల్లో ఏవైనా లోపాలుంటే విద్యార్థులు తమ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి అందచేస్తే వారం రోజుల్లో రీప్లేస్ చేస్తారు. 14417 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఏడాది కొత్త డిజైన్లో యూనిఫామ్ క్లాత్ అందించనున్నారు. ఈ నెల 30 నుంచి కొత్త యూనిఫామ్ తో రావాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.