WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో చివరి రోజు అద్భుతాలేవి జరగలేదు. భారత్ బ్యాటర్లు కనీసం పోరాటం చేయకుండానే చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్ల దాటికి టీమిండియా 234 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కనీసం ఒక సెషన్ కూడా ఆడకుండానే భారత్ చివరి ఏడు వికెట్లను 55 పరుగులకే కోల్పోయింది.
ఓవర్ నైట్ స్కోర్ 164/3తో 5వ రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ టపటపా వికెట్లను కోల్పోయింది. కోహ్లి(49), జడేజా (0) జట్టు స్కోర్ 179 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టారు. రహానే ( 46), భరత్ (23) కాసేపు నిలబడ్డారు. అయితే రహానే అవుటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.
444 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 234 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో గెలిచింది. ఆసీస్ బౌలర్లలో లయన్ 4 వికెట్లు పడగొట్టగా…బోలాండ్ 3, స్టార్క్ 2 , కమిన్స్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో అద్భుత్ సెంచరీ (163)తో మ్యాచ్ ను టర్న్ చేసిన ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోపిని ఆస్ట్రేలియా తొలిసారిగా కైవసం చేసుకుంది. దీంతో ఆ జట్టు మూడు ఫార్మేట్లలో వరల్డ్ ఛాంపియన్ నిలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆసీస్ వన్డేల్లో ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ ను కూడా గెలిచింది. ఇప్పుడు టెస్టుల్లో ప్రపంచ కప్ గెలిచింది.
భారత్ జట్టు వరుసగా రెండోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓడింది. గత ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది.