Southwest Monsoon latest news(AP updates): ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ ప్రాంతాలపై విస్తరించి ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ వివరించింది. వచ్చే 24గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తారిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు పడే అవకాశాముందని ప్రకటించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో 3రోజులపాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.