TSPSC : తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష జరిగింది. మొత్తం 994 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది.
టీఎస్ఆర్టీసీ ప్రత్యే బస్సులు ఏర్పాటు చేసి అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు తరలించింది. అభ్యర్థులను నిశితంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి పంపించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
ఉదయం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఆ తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించారు. ఇలా హైదరాబాద్ మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఓ అభ్యర్థిని, సిద్ధిపేటలో మరో అభ్యర్థిని పరీక్షకు అనుమతించలేదు.
మొత్తం 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదలైంది. తొలుత అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. అప్పుడు 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 25,050 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. ఇంతలో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అధికారులు రద్దు చేశారు. తాజా ప్రిలిమ్స్ పరీక్షలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ వార్నింగ్ ఇచ్చింది.