WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ సమరం ఉత్కంఠభరిత ముగింపునకు చేరుకుంది. ఐదో రోజు ఆట ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టీమిండియా గెలవాలంటే.. చివరి రోజు 280 పరుగులు చేయాల్సి ఉంది. అదే 7 వికెట్లు పడగొడితే.. ఆస్ట్రేలియాదే విజయం. దీంతో ఐదో రోజు ఆట రసవత్తరంగా మారింది. విరాట్ కోహ్లి 44 పరుగులతో, అజింక్య రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రోహిత్ శర్మ 43 పరుగులు చేయగా.. గిల్ 18 పరుగులు, పుజారా 27 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఆరంభంలో భారత్ అదరగొట్టినా.. వంద లోపు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయేసరికి.. ఆచితూచి ఆడాల్సిన అవసరం ఏర్పడింది. నాలుగో రోజు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో.. 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఆసీస్ వేగంగా స్కోర్ చేయలేకపోయింది.
రవీంద్ర జడేజా 3 వికెట్లు, ఉమేష్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్ కు 444 పరుగుల భారీ లక్ష్యం ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. -అయితే విజయం అయినా దక్కాలి.. లేకపోతే మ్యాచ్ ను కనీసం డ్రాగానైనా ముగించాలి. దీంతో ఇవాళ టీమిండియా ఆటతీరు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది.
క్రీజులో ఇంకా కోహ్లి, రహానే ఉండటం..అలాగే జడేజా, శార్దూల్ ఠాకూర్ బ్యాటతో రాణించగల సత్తా ఉన్నవారే. మొదట్లో వికెట్లు కాపాడుకుంటే భారత్ విజయాన్ని అందుకునే అవకాశాలుంటాయి. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా.. మ్యాచ్ వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కోహ్లి, రహానే నిలబడతారా..? ఆసీస్ బౌలర్లను అడ్డుకుంటారా..? గద దక్కేదెవరికో? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.