BJP: కేసీఆర్ను ఓడించడమే మెయిన్ టార్గెట్. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన వారి పంతం, చేస్తున్న శపథం ఇది. బీజేపీలో ఓ వర్గం కేసీఆర్కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. కేసీఆర్ను ఎట్టిపరిస్థితుల్లో కుర్చీ నుంచి దించేయాలనే పట్టుదలతో ఉన్న వర్గం కూడా ఉంది. ఈ వర్గానికి నాయకత్వం వహిస్తున్నది ఈటలనే. ఈ మధ్య పార్టీ వీక్ అయిపోవడంతో తన లక్ష్యం ఎక్కడ పక్కకుపోతుందోనన్న బెంగ పట్టుకుంది. అందుకే, ఆ పార్టీలో పెద్దగా ఇమడలేకపోతున్నారు. కేసీఆర్ను గట్టిగా వ్యతిరేకించే వారిని ఎలాగైనా బీజేపీలో చేర్చి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పాలనుకున్నారు. కానీ, ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. చేరికల కమిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ.. తన వల్ల కాలేదు. అందుకే, ఢిల్లీ వెళ్లి తనకు ఇంకాస్త ఎక్కువ పవర్స్ కావాల్సిందేనని చెప్పుకుంటున్నారు. బీజేపీలోకి మిగతా పార్టీల ముఖ్య నేతలు రావాలంటే.. కొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుందని, అలా హామీలు ఇచ్చే అధికారం ఇవ్వాలని అడుగుతున్నారు. ఈలోపే ఖమ్మంలో పొంగులేటి తన అనుచరులతో సమావేశం అవడం, కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించడం జరిగిపోయింది. కేసీఆర్ను గట్టిగా వ్యతిరేకించే ఓ కీలక నేత చేజారారు. పైగా బీజేపీకి బలమే లేని ఖమ్మంలో కచ్చితంగా ఓట్లు, సీట్లు వచ్చే అభ్యర్థి వెళ్లిపోయారు. ఇక మిగిలింది జూపల్లి మాత్రమే.
జూపల్లికి కూడా కేసీఆర్ అంటే మహా కోపం. జూపల్లి బీజేపీలోకి ఎంట్రీ ఇస్తే మహబూబ్నగర్ జిల్లాలో ఆ పార్టీ బలం మరింత పెరుగుతుంది. జూపల్లి విషయంలోనూ పార్టీ చేతులెత్తేసింది. జూపల్లి మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీలోకి వెళ్తున్నారో చెప్పకుండా సస్పెన్స్లో పెట్టారు. బీజేపీ నుంచి గట్టి హామీ వస్తే తప్ప ఆ పార్టీలో చేరేలా కనిపించడం లేదు. ఆ హామీ ఏంటన్నది ఈటలకు మాత్రమే తెలుసు. అందుకే, ఢిల్లీ వెళ్లినట్టున్నారు. పైగా ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా వచ్చే లోపు కనీసం జూపల్లిని అయినా పార్టీలోకి తీసుకురావాలి. లేదంటే పార్టీ పరువు పోయినట్టేనని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
ఇప్పుడున్న పరిస్దితుల్లో తెలంగాణలో బీజేపీ బలంగానే ఉందనే సిగ్నల్ ఇవ్వాలంటే చేరికలు కన్ఫామ్. పొంగులేటి, జూపల్లి మినహా ఎవరూ పార్టీ మారే లిస్టులో లేరు. పైపెచ్చు బీజేపీ నుంచే వెళ్లిపోవాలనుకుంటున్న వాళ్లు ఉన్నారంటూ టాక్ నడుస్తోంది. కోమటిరెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, నందీశ్వర్ గౌడ్తో పాటు ఈటల కూడా వెళ్లిపోతారంటూ చెప్పుకుంటున్నారు. ఇంత సంకట పరిస్థితిలో తెలంగాణలో బీజేపీ పరువు నిలబడాలన్నా, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలవాలన్నా అర్జెంటుగా చేరికలు కావాలి. కనీసం జూపల్లి అయినా సరే.