Apsara Murder: అతనో పుజారి.. పెళ్లయ్యింది.. పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ ఆమెకు తెలుసు. అయినా అతడినే ప్రేమించింది.. చివరికి అతడి చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఇది పూజారి వెంకటసాయికృష్ణ నమ్మి నయవంచనకు గురైన అప్సర కథ. అసలు వీరిద్దరికి ఎలా పరిచయమైంది? ఆ పరిచయం ప్రేమగా.. ఆ తర్వాత సహజీవనం చేసే వరకు ఎలా వెళ్లింది? అత్యంత దారుణంగా అప్సరను అంతమొందిచాల్సిన అవసరం సాయికృష్ణకు ఎందుకు వచ్చింది?
అప్సర, సాయికృష్ణ ఎలా కలిశారు?
హైదరాబాద్ సరూర్నగర్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా ఉన్నాడు వెంకటసాయికృష్ణ. MBA పూర్తి చేసిన సాయికృష్ణ.. కాంట్రాక్టర్గా కూడా పనిచేస్తున్నాడు. అదే కాలనీలో అప్సర కుటుంబం కూడా అద్దెకు దిగింది. అప్సరకు రోజూ గుడికి వెళ్లే అలవాటు ఉంది. అదే ఇద్దరి మధ్య పరిచయం పెరిగేందకు కారణమైంది. కొన్ని రోజుల తర్వాత ఆ పరిచయం… చనువుగా మారింది. అప్సర తల్లి అరుణని సాయికృష్ణ అక్కా అని పిలుస్తూ.. వారి ఇంటికి కూడా వెళ్లివస్తుండేవాడు. అందుకే సాయికృష్ణతో అప్సర బయటికి వెళ్లిన అనుమానించేది కాదు తల్లి అరుణ. శంషాబాద్ సమీపంలోని సుల్తాన్పల్లిలో వెంకటసాయికృష్ణ నిర్వహిస్తున్న గోశాలకు అతనితోపాటు పలుసార్లు వెళ్లింది అప్సర.
వివాహేతర సంబంధానికి కారణాలేంటి?
సరూర్ నగర్ రావడానికి ముందు అప్సర కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించింది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మోడలింగ్, సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్లో అవకాశాల కోసం అన్వేషణ ప్రారంభించింది. దీనినే తనకు అనుకూలంగా సాయికృష్ణ మలుచుకున్నాడన్న అనుమానాలు ఉన్నాయి. ఆమెకు సినిమాల్లో అవకాశం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని అప్సరకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అతడికి పెళ్లయిందని.. భార్య, పిల్లలు ఉన్నారని తెలిసినా ఆమె బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
హత్య చేయాల్సిన అవసరం ఏంటి?
వివాహేతర సంబంధం కారణంగా అప్సర ప్రెగ్నెంట్ అయింది. గతంలో ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు సాయికృష్ణ. ఆ సమయంలో కూడా వారిద్దరి మధ్య ఏ సమస్యా రాలేదు. కానీ ఎప్పుడైతే అప్సర తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చిందో.. పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానని బెదిరించిందో.. అప్పటి నుంచి అసలు సమస్య మొదలైంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అప్సరను అంతమొందించాలని అనుకున్నాడు సాయికృష్ణ.
అప్సర హత్యకు పక్కా ప్లానింగ్
హత్యకు వారం రోజుల ముందు ‘మనిషిని చంపడం ఎలా?’ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఈ నెల 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరను నమ్మించాడు సాయికృష్ణ. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని.. ఆమెను శంషాబాద్ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి చెప్పి బయల్దేరాడు సాయికృష్ణ.
హత్య జరిగిన రాత్రి ఏం జరిగింది?
ఆ రోజు రాత్రి సాయికృష్ణ, అప్సర కారులో సరూర్నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి 11 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్లో భోజనం చేసి సుల్తాన్పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. ఈ సమయంలో కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో కూడా తనను హత్య చేస్తాడని వన్ పర్సెంట్ కూడా అనుమానించలేదు అప్సర. కోయంబత్తూర్ వెళ్దామని తీసుకొచ్చి అక్కడక్కడే తిప్పుతున్నా ఆమెకు ఏ మాత్రం అనుమానం రాలేదు. ఏ మాత్రం అనుమానం వచ్చిన ఈ రోజు అప్సర ప్రాణాలతో ఉండేది. కాసేపటికి మెడిసిన్ వేసుకోవడంతో గాఢ నిద్రలోకి వెళ్లింది అప్సర. ఆ తర్వాత కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సాయికృష్ణ.. అక్కడ సీటు కవర్తో ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత బెల్లం కొట్టే రాయితో తలపై తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
హత్య జరిగిన తర్వాత ఏం చేశాడు?
అప్సర మృతదేహాన్ని కారులో ఉంచి కారు కవర్ కప్పాడు సాయికృష్ణ. ఏం తెలియనట్టుగా సరూర్నగర్లోని ఇంటికి చేరుకొని.. మృతదేహం ఉన్న కారును పార్క్ చేశాడు. హత్య చేశాను అన్న టెన్షన్ ఏ మాత్రం కూడా సాయికృష్ణలో లేదు. ఆ రక్తం అంటిన చేతులతోనే గుడికి వెళ్లి ఎప్పటిలానే పూజా కార్యక్రమాలను నిర్వహించాడు సాయికృష్ణ. అంతేకాదు సరూర్నగర్లో బొడ్రాయి ఉత్సవాల్లోనూ పాల్గొన్నాడు. అప్పుడు కూడా సాయికృష్ణ ప్రవర్తనపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాలేదు.
మృతదేహాన్ని మాయం చేసేందుకు మాస్టర్ ప్లాన్
కోయంబత్తూరు వెళ్తానన్న అప్సర ఫోన్ ఎత్తకపోవడంతో సాయికృష్ణను సంప్రదించింది ఆమె తల్లి అరుణ. శంషాబాద్ వెళ్లాక మనసు మార్చుకొని ఫ్రెండ్స్తో కలసి భద్రాచలం వెళ్లిందంటూ బుకాయించాడు. ఆ తర్వాత ఈ నెల 5న సాయంత్రం శంషాబాద్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పటికి కూడా అప్సర మృతదేహం అతని కారులోనే ఉంది. ఇక అప్సర బాడీని అక్కడ ఉంచడం సరికాదనుకున్న సాయికృష్ణ.. సరూర్నగర్లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్హోల్లో పడేశాడు. ఆ తర్వాత దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్హోల్ను కప్పి సిమెంట్తో పూడ్పించాడు. వాసన రాకుండా కెమికల్స్ కూడా కొట్టించాడు ఈ మహా మేధావి.
పూజారి దొరికాడు ఇలా..
పోలీసుల ఎదుట వెంకటసాయికృష్ణ తనకేమీ తెలియదన్నట్టుగా నటించాడు. అప్సర తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని బుకాయించాడు. దీంతో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వారిద్దరు సుల్తాన్పల్లి వెళ్లినట్టు గుర్తించారు. అంతేగాకుండా అప్సర భద్రచాలం వెళ్లిపోయిందని చెప్పిన సమయంలో కూడా వారిద్దరు ఒకే దగ్గర ఉన్నట్టు సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. దీంతో పోలీస్ స్టైల్లో అడిగే సరికి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సాయికృష్ణ చెబుతుందేంటి?
అసలు అప్సరను హత్య చేసే ఉద్దేశమే లేదన్నాడు సాయికృష్ణ. పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేయడంతోనే హత్య చేసినట్లు అంగీకరించాడు. పెళ్లి చేసుకోకుంటే ఫొటోలు వైరల్ చేస్తానని అప్సర బెదిరించిందని చెబుతున్నాడు సాయికృష్ణ.
నమ్మకమే..చంపేసిందా?
ఏదేమైనా నమ్మకం ఉన్నచోటే నమ్మకద్రోహం ఉంటుంది. అప్సర అతడిని పూర్తిగా నమ్మింది కాబట్టే.. అతని వెంట వెళ్లింది. నమ్మింది కాబట్టే.. పెళ్లైందని తెలిసినా అతడితో సహజీవనం చేసింది. చివరికి నమ్మింది కాబట్టే.. అత్యంత దారుణంగా హత్యకు గురైంది. సో ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలి. మీ నమ్మకమే మీ ప్రాణాలకు ముప్పు తేవచ్చు. తస్మాత్ జాగ్రత్త.