Polavaram latest news telugu(AP politics) : టీడీపీ నేతలు చేపట్టిన పోలవరం యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రాజెక్టు వద్దకు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరు టీడీపీ నేతలు ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరారు. అయితే వారిని కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణతోపాటు మరికొందరు పార్టీ నేతలను పోలీసులు ఆపేశారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు ప్రతిఘటించారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసుల కళ్లుగప్పి బైక్ పై పోలవరం వైపు బయలేదారు. అయితే ఆయను పోలీసులు అదుపులోకి తీసుకుని కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగిలిన టీడీపీ నేతలను గోపాలపురం పీఎస్ కు తరలించారు. మరోవైపు పోలవరం వద్ద పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు.