Cyclone : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. మరో 24 గంటల్లో మరింత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపింది. తుపాను ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈదురు గాలులు బలంగా వీస్తాయని హెచ్చరించింది. భారీ అలల కారణంగా గుజరాత్లోని పర్యాటక ప్రదేశం తితాల్ బీచ్ను ఈ నెల 14 వరకు మూసివేశారు.
జూన్ 10 నుంచి 12 వరకు తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో
45 నుంచి 55 కిలోనాట్స్ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. గాలుల వేగం 65 కిలోనాట్స్ వరకు పెరగవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్లే అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.