WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసిన ఆసీస్.. భారత్ ను 296 పరుగులకే పరిమితం చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 173 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 3వ రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఇప్పటికే 296 పరుగుల లీడ్ సాధించింది.
అంతకుముందు 5 వికెట్ల నష్టానికి 151 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఆదిలోనే కీపర్ కేఎస్ భరత్ (5) వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో రహానే (89), శార్ధుల్ ఠాకూర్ (51) అద్భుతంగా ఆడి 6వ వికెట్ కు 109 పరుగులు జోడించారు. రహానే అవుటైన తర్వాత శార్ధుల్ పట్టుదలతో ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ ను ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించాడు. ఉమేష్ యాదవ్, శార్ధుల్, షమీ వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు, స్టార్క్ , గ్రీన్, బొలాండ్ తలో రెండు వికెట్లు తీయగా.. లయన్ కు ఒక వికెట్ దక్కింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 24 పరుగులకే ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (13), డేవిడ్ వార్నర్ (1) వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ హీరోలు స్టివ్ స్మిత్ (34), ట్రావిస్ (18) త్వరగా అవుట్ కావడంతో ఆసీస్ 111 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 3వ రోజు ఆటముగిసే సరికి మార్నస్ లబుషేన్ (41 బ్యాటింగ్), గ్రీన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, ఉమేష్ తలో వికెట్ పడగొట్టారు.
నాలుగో రోజు ఆట కీలకంగా మారింది. ఆసీస్ ను త్వరగా ఆలౌట్ చేస్తే భారత్ కు విజయావకాశాలు ఉంటాయి. అప్పుడు భారత్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేయాలి. లేదంటే ఆసీస్ గెలుపు లాంఛనమే.