CM Jagan: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పీఆర్సీ అమలు కోసం జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీఎన్జీవో నేతలు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కాసేపు ముచ్చటించారు.
ఉద్యోగుల విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం జగన్. ఉద్యోగులకు సమస్యలు ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. సీపీఎస్లో లేనివి.. జీపీఎస్లో ఉన్నాయని, రెండేళ్ల పాటు జీపీఎస్పై ఆర్థికశాఖ సుదీర్ఘ కసరత్తు చేసిందన్నారు.
12వ పీఆర్సీ ప్రకటించడంతో పాటు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించడంలో సీఎం జగన్ కు కృతజ్ణతలు తెలిపామని ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారన్నారు. తాము ప్రభుత్వానికి అమ్ముడు పోలేదని, సీపీఎస్ రద్దు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు బండి శ్రీనివాస్. గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్లు జీపీఎస్ ఉందన్నారు ఏపీ ఎన్జీవో జనరల్ సెక్రటరీ శివారెడ్డి. ఓపీఎస్ కావాలనే తాము కోరుతున్నాం, ఓపీఎస్ ను సాధించేందుకు కృషి చేస్తామన్నారు శివారెడ్డి.
సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారని, చెప్పింది చెప్పినట్లుగా చేయకపోయినా ప్రత్నామ్నాయం తీసుకువచ్చారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఓపీఎస్ తో సమానంగా ఉద్యోగులకు ప్రయోజనం ఇచ్చేలా జీపీఎస్ తీసుకు వచ్చారని చెప్పారు. జీపీఎస్ ను తీసుకు వచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. జీపీఎస్ తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత మురళీ మోహన్ అన్నారు. ఓపీఎస్ సాధన కోసం సీపీఎస్ ఉద్యోగులతో కలసి పోరాటం కొనసాగిస్తామన్నారు.