BJP: వస్తారనుకున్న పొంగులేటి రానురానన్నారు. ఈటల రెండుసార్లు భేటీ జరిపినా.. ఆ బడా కాంట్రాక్టర్ ఏమాత్రం బెండ్ అవలేదు. తాను, తన అనుచరులు కాంగ్రెస్లోనే చేరబోతున్నామని చెప్పేశారు. పొంగులేటి చేరిక.. ఖమ్మం కాంగ్రెస్కు బిగ్ బూస్ట్. అదే సమయంలో బీజేపీకి అంతకన్నా బిగ్ మైనస్.
ఒక్క నాయకుడితో అంతా మారిపోతుందా? అంటే, అవుననే అంటున్నారు. పొంగులేటి మామూలు లీడర్ కానేకాదు. ఉమ్మడి ఖమ్మంలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ మంచి ప్రభావం చూపగల లీడర్ పొంగులేటి. కాంగ్రెస్+పొంగులేటి కాంబినేషన్ మామూలుగా ఉండదు మరి. ఈసారి ట్రయాంగిల్ వార్లో ప్రతీ సీటు కీలకం కానున్న నేపథ్యంలో.. ఇలా 10కి 10 స్వీప్ చేసే ఛాన్స్ ఉన్న ఖమ్మం జిల్లా చేజారిపోవడం ఏ పార్టీకి అంత మంచిది కాదు.
అసలే ఖమ్మం రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్కటంటే ఒక్క సీటే ఇచ్చారు ఖమ్మం ప్రజలు. చాలాచోట్ల పొంగులేటి వెన్నుపోటు వల్లే ఓడిపోయామనేది బీఆర్ఎస్ భావన. అందుకే, ఆయన్ను అప్పటినుంచి పక్కనపెట్టేశారు. ఇప్పుడాయన కారు దిగేశారు. చేతితో చేయి కలిపేందుకు సిద్ధమయ్యారు.
పొంగులేటి కాంగ్రెస్లో చేరడం.. బీఆర్ఎస్ కంటే బీజేపీనే ఎక్కువ కలవరపెడుతోంది. ఆయన కాషాయ కండువా కప్పుకొని ఉండుంటే.. తెలంగాణలో బీజేపీ బలం, బలగం మరోలా ఉండేది. కర్నాటక తర్వాత తెలంగాణపైనే అధిక ఆశలు పెట్టుకుంది కమలదళం. ఇక్కడ గెలిచేందుకు ఉన్న ఏ ఒక్క ఛాన్స్ను మిస్ చేసుకోదలుచుకోలేదు. అందుకే, పొంగులేటిపై ఎంతగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించినా.. కేంద్రం తరఫున అంతగా ఆశపెట్టినా.. ఆయన మాత్రం చిక్కలేదు. కేసీఆర్పై పోరాటంలో బీజేపీ చిత్తశుద్ధి నమ్మశక్యంగా లేదంటూ.. ఈ విషయంలో కాంగ్రెస్సే బెటరంటూ చేతి గుర్తుకే జై కొట్టారు.
పొంగులేటినే తమను నమ్మకపోతే.. ఇక సామాన్య ప్రజలు ఇంకేం నమ్ముతారని.. డిఫెన్స్లో పడిపోయింది బీజేపీ. అందుకే, ఏ ఖమ్మంలో అయితే తమకు ఎదురుదెబ్బ తగిలిందో.. అదే ఖమ్మంలో కాషాయ సత్తా చాటేలా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 15న అమిత్ షా స్వయంగా ఖమ్మం సభకు రానున్నారు. పొంగులేటి పోయినా.. తమకు నో ప్రాబ్లమ్ అనేలా.. భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టి.. తామింకా రేసులోనే ఉన్నామనే బలమైన మెసేజ్ ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యారు కమలనాథులు. ఇంత చేస్తున్నా.. బీజేపీ ఖమ్మంలో కనీసం ఖాతా అయినా తెరుస్తుందా? జిల్లాలో ఒక్క సీటైనా వస్తుందా? డౌటే అంటున్నారు.