Mumbai: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ను చంపేస్తామంటూ కొందరు దుండుగులు బెదిరింపులకు దిగారు. పవార్ను హత్య చేస్తామని ట్విట్టర్లో బెదిరించారు. ఈ బెదిరింపులపై శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ముంబై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తన తండ్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ట్విట్టర్లో కొందరు బెదిరించారని.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శరద్ పవార్కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్, ఆయన సోదరుడు సునీల్ రౌత్లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కాల్స్ ద్వారా కొందరు దుండగులు బెదిరించారని సునీల్ రౌత్ తెలిపారు. మీడియాతో మాట్లాడవద్దని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్కు, తనకు హత్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఈ ఘటనపై ముంబై పోలీస్ కమిషనర్, రాష్ట్ర హోంమంత్రికి సమాచారం అందించామని సునీల్ రౌత్ తెలిపారు.
సుప్రీయా ఫిర్యాదుపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. FIR నమోదు చేసి.. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తిస్తామన్నారు ముంబై పోలీసులు.