BCCI : దేశంలో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు గౌరవం దక్కనుంది. ఇన్నాళ్లూ మ్యాచ్ ఫీజులో ఉన్న వ్యత్యాసం… ఇకపై తొలగిపోనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన పురుష క్రికెటర్లతో సమానంగా… సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించిందని… మహిళా క్రికెటర్లపై ఉన్న వివక్షను పారద్రోలేలా బీసీసీఐ చారిత్రక నిర్ణయం తీసుకుందని షా ట్వీట్ లో వెల్లడించాడు. లింగ భేదం లేకుండా పే ఈక్విటీ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నామని… మహిళల క్రికెట్లో ఇది సరికొత్త అధ్యాయమని షా అభివర్ణించాడు. ఇకపై పురుష క్రికెటర్లకు ఇస్తేన్నట్లే… మహిళా క్రికెటర్లకు కూడా టెస్ట్ మ్యాచ్కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కి 3 లక్షల రూపాయలు చెల్లించనున్నట్లు షా ప్రకటించాడు.
మ్యాచ్ ఫీజుల్లో మాత్రమే ఎలాంటి తేడా లేకుండా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు ఫీజు ఇవ్వబోతున్నారు. వార్షిక వేతనం విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదు. ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన పురుష క్రికెటర్ల వార్షిక వేతనం విషయానికొస్తే… ఏ ప్లస్ కేటగిరీ క్రికెటర్లకు 7 కోట్లు, ఏ కేటగిరీ ప్లేయర్లకు 5 కోట్లు, బి కేటగిరీ ఆటగాళ్లకు 3 కోట్లు, సీ కేటగిరీ ప్లేయర్లకు కోటి రూపాయలు ఇస్తున్నారు. అదే మహిళా క్రికెటర్ల విషయానికొస్తే.. ఏ గ్రేడ్ ప్లేయర్లకు 50 లక్షలు, బీ గ్రేడ్ ప్లేయర్లకు 30 లక్షలు, సీ గ్రేడ్ ప్లేయర్లకు 10 లక్షలు వార్షిక వేతనంగా ఇస్తున్నారు. ఇది పురుష క్రికెటర్ల వార్షిక వేతనంలో కేవలం పది శాతం మాత్రమే. మ్యాచ్ ఫీజుల విషయంలో ఇకపై వివక్ష కొనసాగబోదని ఇప్పుడు ప్రకటించిన బీసీసీఐ… భవిష్యత్ లో వార్షిక వేతనం విషయంలోనూ ఎలాంటి వివక్ష చూపకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.