India Beat Netherlands : T20 వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-12లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో గెలిచింది… భారత్. గ్రూప్ 2లో 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్… మూడో ఓవర్లోనే కె.ఎల్.రాహుల్ వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో కూడా రాహుల్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కేవలం 9 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ ధాటిగా ఆడారు. రోహిత్ శర్మ 39 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 53 రన్స్ చేసి ఔటయ్యాడు. రెండో వికెట్ కు కోహ్లీతో కలిసి 73 పరుగులు జోడించాడు. రోహిత శర్మ ఔటయ్యాక వచ్చిన సూర్యకుమార్ యాదవ్, కోహ్లీతో కలిసి చెలరేగి ఆడాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 95 రన్స్ జోడించారు. కోహ్లీ 44 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 62 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 25 బంతుల్లోనే ఒక సిక్సర్, 7 ఫోర్లతో 51 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. వీళ్లిద్దరి వీరబాదుడుతో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది… టీమిండియా.
180 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్… ఛేజింగ్ లో ఏ మాత్రం దూకుడు కనబరచలేదు. ఆ జట్టు ఆటగాళ్లంతా ఇలా వచ్చి అలా పెవిలియన్ వెళ్లిపోయారు. ఆ జట్టులో బ్యాటర్లలో టాప్ స్కోర్ 20 అంటే… నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా సగం బాటర్లు సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే చేయగలిగారు. దాంతో… 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది… నెదర్లాండ్స్. భారత బౌలర్లలో భువీ, అర్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్ తలో రెండు వికెట్లు తీయగా… షమీకి ఒక వికెట్ దక్కింది. కేవలం 25 బంతుల్లో 51 రన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.