Southwest Monsoon : ఎట్టకేలకు భారత్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తాజాగా కేరళ తీరాన్ని తాకాయని భారత్ వాతవరణశాఖ ప్రకటించింది. గతేడాది కంటే 7 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని తెలిపింది.
లక్షద్వీప్, కేరళ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ వివరించింది. రుతుపవనాల రాక వల్ల కేరళలో గత 24 గంటల నుంచి వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వచ్చే 48 గంటల్లో రుతుపవనాలు కేరళలోని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయని ప్రకటించింది. అదే సమయంలో కర్ణాటక, తమిళనాడు మీదుగా రుతుపవనాలు కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. గంటకు 19 నాట్ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశంతో తొలి వారంలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానాన్ని తాకుతాయి. అయితే వాతావరణ మార్పులు, తుపాను ప్రభావం వల్ల ఈ ఏడాది వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. గతేడాది మే 29న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న వచ్చాయి.
ఈసారి సముద్రంపై ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. అయితే ఈ సీజన్లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ గతంలోనే ప్రకటించింది. దేశంలో 52 శాతం సాగు భూమికి వర్షం ప్రధాన ఆధారం. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఇక్కడ నుంచే 40 శాతం దిగుబడి వస్తుంది.