Jagan : రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఈ–ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల మున్సిపాల్టీలకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి 516 ఈ-ఆటోలను ప్రారంభించారు. 36 మున్సిపాల్టీలకు వీటిని పంపిణీ చేశారు. ఒక్కో ఆటో ఖరీదు రూ.4.10 లక్షలు. మొత్తం రూ.21.18 కోట్లతో ఈ-ఆటోలను కొనుగోలు చేశారు. ఆటో సామర్థ్యం 500 కిలోలు. ఈ– ఆటో డ్రైవర్లుగా మహిళలకే ఎక్కువ మంది అవకాశం కల్పించారు.
ఇప్పటికే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లో చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణ కోసం 40 లక్షల కుటుంబాలకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో 3 చొప్పున చెత్తబుట్టలు ఇచ్చింది. గ్రేడ్–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను ఉపయోగిస్తున్నారు. విశాఖ,గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించారు.
81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టు కంపోస్ట్, 4 బయో మిథనేషన్ ప్రాజెక్ట్లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్లు ఏర్పాటు చేస్తున్నారు. 55 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.