Kerala : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించనున్నాయి. శుక్రవారానికల్లా కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది. రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు వీస్తున్నాయి.
గతేడాది జూన్ ఒకటినే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కానీ ఈ ఏడాది వారం రోజులపైగా ఆలస్యంగా వస్తున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. ఇది జూన్ 5న ఏర్పడింది. బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.
రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించనున్నాయి. అరేబియా సముద్రం, లక్షద్వీప్, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలు, నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ తెలిపింది.