AP Cabinet : ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 63 నిర్ణయాలను ఆమోదించింది. కాంట్రిబ్యూటరీ పింఛను పథకం ఉన్న ఉద్యోగులకు గ్యారంటీ పింఛను పథకం వర్తింప చేయాలని తీర్మానించింది. జీపీఎస్ వల్ల ఉద్యోగి పదవీ విరమణ చేసే చివరి నెల బేసిక్ వేతనంలో 50 శాతం పింఛనుగా వస్తుంది. దీనికి ఏటా రెండు డీఆర్లు కలుపనున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం పాత పింఛను విధానాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. మరి జీపీఎస్ కు ఒప్పుకుంటారా..? లేదా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారా అనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్ర విభజన నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా 5 ఏళ్లు పూర్తి చేసుకున్న 10 వేల మంది సర్వీస్ ను క్రమబద్దీకరించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వివిధ శాఖల్లో 6,840 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ వైద్యవిధాన పరిషత్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ శాఖగా మార్పు చేయాలని నిర్ణయించింది. ఇందులోని 14,653 మంది ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 010 పద్దు నుంచి జీతాల చెల్లించాలని నిర్ణయించింది.
అన్ని జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు ఒకే విధంగా 16 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలని తీర్మానించింది. 2022 జనవరి డీఏ, డీఆర్ 2.73 శాతం మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది.12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పులివెందుల, పాడేరు, ఆదోని వైద్య కళాశాలలకు ఒక్కోదానికి 706 పోస్టుల చొప్పున మొత్తం 2,118 పోస్టులు మంజూరు చేసింది. చిత్తూరు డెయిరీకి చెందిన 28.35 ఎకరాలను అమూల్కు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.