WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో తొలిరోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్.. తొలిరోజు ఆటముగిసే సరికి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ చెలరేగి ఆడాడు. భారీ శతకంతో అదరగొట్టాడు. వన్డే తరహాలో ధాటిగా బ్యాటింగ్ చేశాడు. హెడ్ తొలిరోజు 156 బంతుల్లోనే 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 146 పరుగులు చేశాడు.
భారత్ బౌలర్లు తొలుత అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆసీస్ స్కోర్ 2 పరుగుల వద్ద ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (43), మార్నస్ లబుషేన్ (26) కాసేపు భారత్ బౌలర్లను అడ్డుకున్నారు. అయితే ఈ ఇద్దరూ 5 పరుగుల తేడాతో అవుట్ అయ్యారు. వార్నర్ ను శార్దుల్ ఠాకూర్ అవుట్ చేయగా..లబుషేన్ ను షమి బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో స్టివ్ స్మిత్ తో జతకట్టిన ట్రావిస్ హెడ్ భారత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరోవైపు స్మిత్ క్రీజులో పాతుకుపోయి అతడికి సహకారం అందించాడు. తొలుత 24.1 ఓవర్లలో 3 వికెట్లు తీసిన భారత్ పేసర్లు ఆ తర్వాత పూర్తిగా తేలిపోయారు. 60.5 ఓవర్లపాటు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. 4వ వికెట్ కు హెడ్ (146 బ్యాటింగ్), స్మిత్ ( 95 బ్యాటింగ్) అజేయంగా 251 పరుగులు జోడించారు. రెండోరోజు కూడా ఆసీస్ ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్ పై ఆ జట్టు పట్టు సాధించినట్లే. మరి భారత్ బౌలర్లు రెండోరోజైనా రాణిస్తారా..? కంగారూల దూకుడుకు కళ్లెం వేస్తారా..?