Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్లో ముసలం మరింత ముదిరింది. సీఎం అశోక్ గహ్లోట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిరిందని పార్టీ హైకమాండ్ చెబుతోంది. కానీ వాస్తవంగా పరిస్థితులు వేరేలా ఉన్నాయి. వారి మధ్య రోజు రోజుకీ దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. అధిష్ఠానం ముందుంచిన డిమాండ్ల విషయంలో సచిన్ వెనకడుగు వేయబోరని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. పార్టీ పెద్దల స్పందన కోసమే వేచి చూస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ కొత్త రాజకీయ పార్టీ పెడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నెల 11న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అదేరోజు సచిన్ పైలట్ తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి. ఆ కార్యక్రమంలోనే సచిన్ తన రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
మాజీ సీఎం వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ నియామక పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలన్నారు. పశ్నాపత్రాలు లీకైన ప్రభుత్వ నియామక పరీక్షలను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచారు. సీఎం మాత్రం పైలట్ ప్రస్తావించిన అంశాలపై చర్యలు ప్రారంభించలేదు.
మరోవైపు గత వారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో సీఎం అశోక్ గహ్లోట్, సచిన్ పైలట్ పాల్గొన్నారు.త్వరలో జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఐక్యంగా పనిచేస్తామని అధిష్ఠానానికి మాట ఇచ్చారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ అశోక్ గహ్లోట్, సచిన్ పైలట్ ఉప్పునిప్పుగానే వ్యవహరిస్తున్నారు.
సచిన్ పైలట్ తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి కార్యక్రమం కోసం దౌసాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను పైలట్కు అత్యంత సన్నిహితుడు రాష్ట్ర మంత్రి మురారీ లాల్ మీనా పర్యవేక్షిస్తున్నారు. అయితే పైలట్ కొత్త పార్టీ ఏర్పాటు ప్రచారాన్ని ఆయన ఖండించారు. కానీ రాజస్థాన్ కాంగ్రెస్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.