AP Cabinet : ఎంతో ఉత్కంఠను, మరెంతో ఆసక్తిని రేపుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభకానుంది. సచివాలయంలోని బ్లాక్ -1 లో సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఓ వైపు ముందస్తు ఎన్నికల ప్రచారం.. మరోవైపు జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ఆసక్తిని కలిగిస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత.. చాలాకాలం నిరీక్షణ తర్వాత జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపైనే చర్చిస్తారని తెలుస్తోంది. కొత్త పీఆర్సీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై చర్చించి.. ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతారని ప్రచారం జరుగుతోంది.
డీఏ, పీఆర్సీ బకాయిలను 4 ఏళ్లలో చెల్లించేలా నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. అలాగే ఎన్నికల హామీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పై ఈ మంత్రివర్గం సమావేశంలో క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యోగులతో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం.. ఓపీఎస్ అమలు విషయంలో ఓ క్లారిటీకి వచ్చిందని సమాచారం. ఉద్యోగులకు మేలు కలిగేలా ప్రత్యేక ప్యాకేజీని అందజేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు, ఇచ్చిన హామీలపై కేబినెట్ లో చర్చిస్తారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరగనుంది. గడప గడప మన ప్రభుత్వం, జగన్నకు చెబుదాం కార్యక్రమాలపై ప్రజా స్పందన చర్చిస్తారని తెలుస్తోంది.
రాజధాని భూములు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ, జాతీయ విద్యా విధానం అమలు, పరిశ్రమలు, సంస్థలకు భూముల కేటాయింపు లాంటి అంశాలు కేబినెట్ లో చర్చకు రానున్నాయి. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.