YSRCP: విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా ఉండేవారు. ఉత్తరాంధ్రను ఏలేవారు. ఢిల్లీలో చక్రం తిప్పేవారు. కానీ, కొంతకాలంగా విజయసాయి ఊసే లేదు. పార్టీలో ఆయన పేరే వినిపించలేదు. తాడేపల్లిలోకి ఎంట్రీనే లేదు. సీఎం జగన్ తనను ఇంతలా పక్కన పెట్టేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డియే కారణమనే భావన ఆయనది. సజ్జల సైలెంట్గా జగన్ పక్కన చేరారని.. తనకు చెక్ పెట్టింది కూడా ఆయననే అనుకుంటున్నారు. కాలం కలిసిరాకపోతుందా? అనే ధోరణిలో ఇన్నాళ్లూ ఓపికగా వేచిచూశారు. విజయసాయిరెడ్డి అనుకున్నట్టే జరిగింది. ఉద్యోగుల తిరుగుబాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, పార్టీలో విభేదాలతో జగన్ దగ్గర సజ్జల పరపతి పడిపోయింది. సజ్జల కాకుండా.. ఇంకెవరు? అని చూస్తే.. మళ్లీ విజయసాయిరెడ్డినే గుర్తుకొచ్చారు. వెంటనే వైజాగ్ నుంచి తీసుకొచ్చి తాడేపల్లిలో పర్మినెంట్ చేసేశారు. పార్టీ విభాగాలకు అధిపతిని చేశారు.
విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ కావడం సజ్జలకు ఎలాగూ ఇష్టం ఉండకపోవచ్చు. తాజాగా, పార్టీ అనుబంధ విభాగాల సంఘాలతో తాడేపల్లి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు విజయసాయి. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను, ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వ్యూహాలను వారికి వివరించారు. అయితే, ఇంతటి కీలక సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్రెడ్డి డుమ్మా కొట్టడం ఆసక్తికరంగా మారింది.
భార్గవ్రెడ్డి.. వైసీపీకి బ్యాక్ బోన్ లాంటి సోషల్ మీడియా విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. విజయసాయి తొలిసారిగా నిర్వహించిన ఈ మీటింగ్కు.. కీలకమైన సోషల్ మీడియా వింగ్ లీడర్ సజ్జల భార్గవ్రెడ్డి గైర్హాజరు కావడం పార్టీలో కలకలం రేపుతోంది. భార్గవ్ ఎందుకు రాలేదు? విజయసాయిరెడ్డి యాక్టివ్ కావడాన్ని అంగీకరించలేకపోతున్నారా? విజయసాయితో తన తండ్రి రామకృష్ణారెడ్డికి ఉన్న విభేదాల వల్లే డుమ్మా కొట్టారా? సజ్జల, విజయసాయిల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే విషయం నిజమేనా? కీలక మీటింగ్కు భార్గవ్రెడ్డి రాకపోవడాన్ని ఎలా చూడాలి? ఇదే చర్చ వైసీపీలో జరుగుతోంది.