Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. వెయ్యి మంది వరకూ గాయపడ్డారు. కొందరి మృతదేహాలను ఇంకా గుర్తించనే లేదు. మార్చురీలో అనాథ శవాలుగా పడున్నాయిప్పుడు. ఇదే విషయాన్ని కొందరు కేటుగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఆ శవం తమ వారిదేనంటూ అధికారులను నమ్మించి.. లక్షల రూపాయల నష్టపరిహారం కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఓ మోసం వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే….
ప్రమాదం జరిగిన రైల్లో తన భర్త ప్రయాణించాడని.. అతని ఆచూకీ తెలీడంలేదంటూ ఓ మహిళా పోలీసులను ఆశ్రయించింది. అయ్యో పాపం అనుకున్న పోలీసులు.. తమ దగ్గర ఉన్న ఫోటోల్లో ఆమె భర్త ఉంటే గుర్తించాలని కోరారు. వాళ్లిచ్చిన ఫోటోలను చూసిన ఆ మహిళ.. అందులో ఓ ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ.. ఇతనే తన భర్త అని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె అలా చెబుతూ.. ఏడవడం కానీ, బాధపడటం కానీ ఏమీ చేయకుండా.. చాలా నార్మల్గా ఉండటం చూసిన పోలీసులకు ఏదో అనుమానం వచ్చింది. వెంటనే, ఆమె నుంచి అదనపు వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా ఆమె ఉండే ప్రాంత పోలీస్ స్టేషన్ను సంప్రదిస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ మహిళ భర్త బతికే ఉన్నాడని.. అతను అసలు ఆ ట్రైన్లోనే జర్నీ చేయలేదని తేలింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. వచ్చిన మహిళను గట్టిగా ప్రశ్నిస్తే.. అసలు విషయం తీరిగ్గా చెప్పింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇస్తోందని తెలిసి.. తాను కావాలనే తన భర్త రైలు ప్రమాదంలో చనిపోయాడని చెప్పానని ఒప్పేసుకుంది.
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికీ వెళ్లింది. ఒడిశా సీఎస్ ప్రదీప్ కుమార్ స్పందించారు. ఇలాంటి మోసపూరిత చర్యలపై అప్రమత్తంగా ఉంటూ.. కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర పోలీసులకు, రైల్వే అధికారులకు సూచించారు.
శవాలతోనూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల తీరు చర్చనీయాంశమవుతోంది. మోసగాళ్లు ఎప్పటికప్పుడు ఇలా కొత్త ఐడియాలతో ముందుకు వస్తుండటం చూసి పోలీసులే షాక్ అవుతున్నారు.