Seed Balls : ఈరోజుల్లో వాతావరణ మార్పులను గుర్తించడం, అంచనా వేయడం చాలా కష్టంగా మారిపోయింది. దీనికి ముఖ్య కారణం.. మారుతున్న మానవాళి జీవనం అని నిపుణులు విమర్శిస్తున్నారు. చెట్లు, మొక్కలు, అడవులు.. ఇలాంటివి అంతిరించిపోవడం వల్లే వాతావరణ మార్పులు పెరుగుతున్నాయని, వాటిని అదుపు చేయడం కష్టంగా మారిందని అంటున్నారు. అందుకే కొందరు విద్యార్థులు స్వచ్ఛందంగా కొత్త ఆలోచనతో మొక్కలను పెంచే ప్రయత్నాలు చేపట్టారు.
అడవులను పెంచడం కంటే వాటిని నిర్మూలించే శాతం ఎక్కవయిపోయింది. ఏళ్ల తరబడి ఎన్నో ఎకరాల్లో విస్తరించి ఉన్న అడువులు కూడా పలు కారణాల వల్ల నిర్మూలనకు గురవుతున్నాయి. కొన్ని దేశాల్లో దీనికి కారణం కార్చిచ్చు అయితే.. కొన్ని దేశాల్లో దీనికి ఇతరేతర కారణాలు కూడా ఉన్నాయి. అడువులను నిర్మూలించి వాటిని మనుషులు నివసించే ప్రాంతాలుగా మార్చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు మనం చూసిన అడవుల్లో ఇప్పుడు బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు లాంటివి కనిపిస్తున్నాయి.
అందుకే కేరళలో కనుమరుగయిపోతున్న అడవులకు మళ్లీ మామూలు రూపం తీసుకొని రావడానికి కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. చెప్పాలంటే ఇది పూర్తిగా కొత్త ఆలోచన కాదు.. ఎనిమిది దశాబ్దాల క్రితం జపాన్లో మొక్కలను పెంచడానికి ఇదే పద్ధతిని ఫాలో అయ్యేవారు. దానినే ఇప్పుడు ఈ విద్యార్థులు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. బంక మట్టిలో విత్తనాలను కలిపి వారకల్ అడవుల్లో పడేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ఈ విత్తనాలే మొక్కలుగా మారుతాయని వారు చెప్తున్నారు.
విద్యార్థులు చేస్తున్న ఈ ప్రయోగానికి వారు ‘సీడ్ బాల్స్’ అని పేరు కూడా పెట్టుకున్నారు. కానీ జపాన్లో మాత్రం ఈ ప్రక్రియను ‘నెండో డాంగో’ అని పిలుస్తారు. 1940ల్లో జపాన్లో ఈ ప్రక్రియను ఎక్కువగా ఫాలో అయ్యేవారని విద్యార్థులు చెప్తున్నారు. ఒక్కొక్క మొక్కను తెచ్చి నాటడం కంటే ఈ సీడ్ బాల్స్ ద్వారా ఎక్కువ చెట్లను పెంచే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ సీడ్ బాల్స్ను వారే తయారు చ చేశారు. దాంతో పాటు వారే అడవులకు వెళ్లి దాదాపు 330 సీడ్ బాల్స్ను ఆ అడవిలో పడేశారు. విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం వర్కవుట్ అయితే.. అడవుల పెంపకంలో ఇది సులువైన ప్రక్రియగా మారుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.