Odisha Train Accident News Today(Telugu news updates): ఒడిశా రైలు దుర్ఘటనపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. 10 మంది సీబీఐ అధికారుల బృందం బాలాసోర్లోని ప్రమాద జరిగిన ప్రాంతానికి వెళ్లింది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించింది. ఒడిశా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను సీబీఐ సేకరించింది.
రైలు ప్రమాదంపై రాష్ట్ర పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యమే కారణమని అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.
విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. లేకపోతే మెయిన్లైన్ మార్గాన్ని లూప్ లైనుకు మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేశామని అంటున్నారు. సీబీఐ దర్యాప్తు తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
రైలు దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 278కి చేరిందని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే చాలా మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఇంకా 101 మృతదేహాలు ఎవరివో తేల్చాల్చి ఉంది. దీంతో మృతదేహాలను భద్రపరచడం ఆస్పత్రులకు సవాలుగా మారింది. మృతదేహాలను గుర్తించేందుకు ఒడిశా ప్రభుత్వం, రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మృతుల ఫొటోలను ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.