Train Accident : కొన్ని బోగీలు గాల్లోకి లేచాయి. అంతే వేగంతో కిందకు పడ్డాయి. దీంతో బోగీలు ధ్వంసమయ్యాయి. ఒక కోచ్ పైకి మరో బోగి దూసుకెళ్లింది. అందులోని ప్రయాణికులు నలిగిపోయారు. రైలు బోగీల్లోని సీట్లు రూపురేఖలు లేకుండా పోయాయి. ప్రయాణికుల సూట్కేసులు, బ్యాగులు, షూలు, చెప్పులు, దుస్తులు చెల్లాచెదురుగా పడిపోయాయి.
చాలామంది ప్రయాణికులు అవయవాలు కోల్పోయి ఆర్తనాదాలు చేశారు. పట్టాలపై ఎటుచూసిన రక్తమే కనిపించింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని తెల్లటి వస్త్రాల్లో చుట్టారు. మృతదేహాలను ఒక చోట ఉంచిన దృశ్యాలు విషాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.
మరోవైపు ఘటనాస్థలిలో బోగీల తొలగింపు చర్యలు చేపట్టారు. ట్రాక్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ ప్రకటించారు. ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ సౌకర్యం లేదని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 17 బోగీలు దెబ్బతిన్నాయని ఎన్డీఆర్ఎఫ్ ఐజీ తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ తర్వాత అన్ని విషయాలు బయటికొస్తాయన్నారు.
రైళ్లు ఒకదానిని మరొకటి ఢీకొనకుండా భారత్ రైల్వేశాఖ కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఒడిశాలో జరిగిన ప్రమాదంపై అనేక వార్తలు వచ్చాయి. కవచ్ సిస్టమ్ పని చేయలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ మార్గంలో కవచ్ వ్యవస్థే లేదని రైల్వేశాఖ అధికారి స్వయంగా ప్రకటించడంతో ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చింది. కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదంటున్నారు.