AP Passengers : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణికులు భారీ సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఏపీకి చెందిన ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. రైల్వే ఛార్ట్ ప్రకారం ప్రమాదం జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.
కోరమండల్ ఎక్స్ప్రెస్లో వస్తున్నవారిలో 47 మంది విజయవాడలో, 22 మంది రాజమండ్రిలో, ఒకరు ఏలూరులో దిగాల్సి ఉంది. మొత్తంగా 70 మంది వరకు ఏపీకి చెందిన ప్రయాణికులు.. షాలిమార్, సంత్రగచ్చి, ఖరగ్పూర్, బాలేశ్వర్ స్టేషన్లలో ఎక్కినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లోనూ ఏపీకి చెందిన ప్రయాణికులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని యశ్వంత్పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఈ రైలు.. ఏపీలోని తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లు మీదుగా వెళ్లింది. వీటిలో ఎక్కువ మంది యశ్వంత్పూర్, తిరుపతి, రేణిగుంట స్టేషన్లలో ఎక్కారు. తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్ల నుంచి 52 మందికిపైగా ప్రయాణికులు ఖరగ్పూర్, హౌరా వెళ్తున్నట్లు రైల్వే ఛార్ట్ ద్వారా తెలుస్తోంది.
అయితే యశ్వంత్ పూర్, కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లలోని జనరల్ బోగీల్లో ప్రయాణించేవారి సంఖ్య తేలలేదు. అందులోనూ భారీ సంఖ్యలో ఏపీకి చెందిన ప్రయాణికులు ఉండొచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో ఏపీకి చెందిన వారిపై దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి సహాయం కావాలన్నా సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. రైల్వే అధికారుల నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలని సూచించారు.