Kavach System : కోరమండల్ ఎక్స్ప్రెస్ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రమాదాన్ని నివారించడంలో రైల్వే అధికారులతోపాటు టెక్నాలజీ వ్యవస్థలు కూడా ఫెయిల్ అయ్యాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ ప్రమాదాన్ని కవచ్ వ్యవస్థ ఎందుకు ఆపలేకపోయిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు రైళ్లు ఒకే ట్రాక్పై ఉన్నప్పుడు.. అవి ఢీకొనకుండా ఆపేందుకు కేంద్ర రైల్వే శాఖ కవచ్ వ్యవస్థ ను 2022లో తీసుకొచ్చింది. కవచ్ టెక్నాలజీ.. ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. కేంద్ర ప్రభుత్వం ఈ టెక్నాలజీని అమల్లోకి తెచ్చింది. ఏటా బడ్జెట్లో ఈ టెక్నాలజీని ట్రాకులకు అమర్చేందుకు కేటాయింపులు చేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదాన్ని నివారించడంలో పూర్తిగా విఫలమైంది.
మరోవైపు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రమాదాలను ఆపడానికి రైలు రక్షణ, హెచ్చరిక వ్యవస్థ కూడా ఉంది. రైల్వే ఇంజిన్లోని క్యాబ్లో సెట్ చేసిన స్క్రీన్పై ప్రతి సిగ్నల్ కనిపిస్తుంది. లోకో పైలట్లకు స్క్రీన్పై.. రైళ్లు ఎంత వేగంగా వెళ్తున్నాయో చూపిస్తుంటుంది. ఇది కూడా రైలు ప్రమాదాలు జరగకుండా కొంతవరకు ఆపుతుంది. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ వ్యవస్థ రైలు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది.