MLA ROJA : ఆర్కే రోజా. వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. జబర్దస్త్ తో ఫుల్ పాపులారిటీ. అలాంటి రోజాకు మంత్రి పదవి రావడమే చాలా కష్టమైంది. మినిస్టర్ అయ్యాక కూడా నియోజకవర్గంలో ఆమె పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. పేరుకే మంత్రి. పెత్తన మంత్రా మరొకరిది. రోజా ఇలాఖాలో చక్రపాణిరెడ్డితో గ్రూప్ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్నారు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి. రోజా దూకుడును అడుగడుగునా అడ్డుకుంటూ.. ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు రామచంద్రారెడ్డి.
రోజా వర్సెస్ పెద్దిరెడ్డి. వారి వైరం ఈనాటిది కాదు. ఒకే జిల్లా.. ఒకే పార్టీ అయినా.. ఎప్పుడూ వారి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్. పెద్దిరెడ్డి బలమైన కీలక నేత కావడం.. రోజా సైతం పాపులర్ లీడర్ కావడంతో.. జగన్ సైతం వారిని ఏమీ అనలేకపోతున్నారు. దీంతో వాళ్లిద్దరూ మరింత చెలరేగిపోతూ.. పరస్పరం రాజకీయంగా చెక్ పెట్టుకుంటున్నారు. పెద్దిరెడ్డితోనే కాదు జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామితోనూ రోజాకు కోల్డ్ వార్ నడుస్తోంది. ఓ టైమ్ లో పెద్దిరెడ్డి టార్చర్ పడలేక జగనన్న దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు రోజా. లేటెస్ట్ గా మరోసారి సీఎం జగన్ ను కలిసిన ఆర్కే రోజా.. నగరిలో వర్గ పోరుపై ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి వర్గం తీరుపై జగన్ దగ్గర రోజా ఆవేదన వ్యక్తం తీవ్ర ఆగ్రహం , అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు.. శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డికి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. పెద్దిరెడ్డి ఆశీస్సులతోనే చక్రపాణిరెడ్డి తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారనేది రోజా మండిపాటు. చక్రపాణిరెడ్డితో పాటు వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ కేజే శాంతి, నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్ లు సైతం ఎమ్మెల్యే రోజాకు సహకరించకుండా ఎదురు తిరుగుతున్నారు. వీళ్లంతా పెద్దిరెడ్డి వర్గంగా నగరి నియోజకవర్గంలో రోజాకు పోటీగా పెత్తనం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయిన తనను పిలవకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు వాళ్లే చేస్తున్నారంటూ రోజా ఆవేదన చెందుతున్నారు.
కొప్పేడులో వ్యతిరేకవర్గం ఆర్బీకే, వెల్నెస్ కేంద్రానికి భూమిపూజ చేయడంపై రోజా ఇటీవల రిలీజ్ చేసిన ఆడియో కలకలం రేపింది. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తుంటే ప్రతిరోజు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని.. వారిని నాయకులు ప్రోత్సహించడం బాధేస్తోందంటూ ఆ ఆడియోలో రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసి గ్రూప్ పాలిటిక్స్ పై ఫిర్యాదు చేశారు మంత్రి రోజా. తన వ్యతిరేక వర్గాన్ని కట్టడి చేయాలని.. లేదంటే నగరి నియోజకవర్గంలో పార్టీకి, తనకు నష్టం జరుగుతుందని జగనన్నతో రోజమ్మ తన గోడు వెల్లబోసుకున్నారు. మరి, మంత్రి పెద్దిరెడ్డి మనుషులను జగన్ కంట్రోల్ చేయగలరా? ఇటు రోజా.. అటు పెద్దిరెడ్డి.. ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి సీఎం జగన్ ది.