CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. సీఎంగా కేసీఆర్ రికార్డు క్రియేట్ చేశారు. ఓ తెలుగు రాష్ట్రానికి వరుసగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఈ జూన్ 2కు.. సీఎంగా తొమ్మిదేళ్లు పూర్తి అవుతాయి. అరుదైన ట్రాక్ రికార్డు కేసీఆర్ ఖాతాలో చేరుతుంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో 2014, జూన్ 2 తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. ఐదేళ్లు పూర్తికాక ముందే.. ఆర్నెళ్లు ముందుగానే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. మరోసారి గెలిచి.. 2018, డిసెంబర్ 13న రెండవ సారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. 2023, జూన్ 2 నాటికి వరుసగా తొమ్మిదేళ్లుగా తెలంగాణ సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు కేసీఆర్. ఇది ఓ రికార్డ్. తెలుగు రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు వరుసగా సీఎం పదవిలో ఇంతకుముందెవరూ లేరు. ఈ అరుదైన మైలురాయి సాధించారు సీఎం కేసీఆర్. అందుకు, గులాబీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. జూన్ 2ను మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు.
అంతకుముందు ఈ రికార్డు నారా చంద్రబాబు నాయుడు పేరు మీద ఉండేది. ఆయన ఏకబిగిన 8 ఏళ్ల 256 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ను గద్దె దింపి.. 1995 సెప్టెంబర్ 1న సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు చంద్రబాబు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసి.. మళ్లీ సీఎం అయ్యారు. 2004 మే వరకూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగారు చంద్రబాబు. అలా, ఆయన వరుసగా ఎనిమిది సంవత్సరాలు 256 రోజులు ముఖ్యమంత్రిగా ఉండి.. రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును సీఎం కేసీఆర్ ఇప్పటికే బ్రేక్ చేశారు. కాకపోతే.. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉంటే.. కేసీఆర్ మాత్రం ప్రత్యేక తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతే తేడా.
అయితే, ఉమ్మడి రాష్ట్రం.. ఏపీ, తెలంగాణగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేసి.. మొత్తం మూడుసార్లు సీఎంగా.. అత్యధికంగా 13 ఏళ్ల 247 రోజుల పాటు రాష్ట్రాన్ని పాలించి అందరికంటే టాప్లో ఉన్నారు. వరుసగా సుదీర్ఘకాలం ఓ తెలుగు స్టేట్కి సీఎంగా కొనసాగిన రికార్డు మాత్రం కేసీఆర్ కొల్లగొట్టారు.
ఇక, చంద్రబాబుకంటే ముందు… కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్ల 221 రోజులు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎన్టీయర్ ఏడేళ్లకు పైగా సీఎంగా ఉన్నారు. వైఎస్సార్ ఐదేళ్ల 111 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. సీఎంగా జగన్ ప్రస్తుతానికి నాలుగేళ్ల పాలనా కాలాన్ని దాటేసి రేసులోకి తానుసైతం అంటున్నారు.
గులాబీ బాస్ ముచ్చటగా మూడోసారి కూడా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. ప్రజావ్యతిరేకత ఎలా ఉన్నా.. విపక్షాల మధ్య ఓట్లు చీలి మళ్లీ తానే సీఎం అవుతానని ధీమాగా ఉన్నారు. అదే జరిగితే.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కౌంట్.. మరింత కంటిన్యూ కానుంది. తెలంగాణ చరిత్రలో ఆయనకంటూ ఓ పేజీ ఉండనుంది.