CM Jagan meeting today(AP breaking news today): ఆంధ్రప్రదేశ్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భూముల ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యధిక ఆదాయం ఇచ్చే 20 శాతం గ్రామాల్లో ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచే ధరలు పెరగనున్నాయి. కొత్త రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని భూమి ధరలను పెంచుతున్నట్లు జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇప్పటికే రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు అధికారులు సమాచారమందించారు. అవసరమైన మార్పు చేర్పులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏలూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని 21 ప్రాంతాల్లో.. భూముల విలువ పెరిగింది. ఏలూరులో 10 ప్రాంతాల్లో 45 శాతం వరకు భూముల ధరలు పెరిగాయి. ఏలూరు రూరల్లో 18 ప్రాంతాల్లో 35 శాతం వరకు ధరలు పెరిగాయి. భూముల ధరలు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూముల ధరలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. గరిష్టంగా 30 నుంచి 70 శాతం వరకు భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరిగింది. కానీ.. గరిష్టంగా 45 శాతం వరకు భూముల ధరలు పెరిగాయి.
అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ధరలు పెంచుతున్నారు. రాష్ట్రంలోని 20 శాతం మేర గ్రామీణ ప్రాంతాల్లో ధరల సవరణ జరుగుతుంది. మొత్తంగా 2వేల318 ప్రాంతాల్లో కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో 7మండలాల్లో మాత్రమే ధరలు పెరిగాయి. హైవేలు, పరిశ్రమలు ఉన్నచోట ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
పాలనా రాజధానిగా చెబుతున్న విశాఖలో అయితే భూధరలు అమాంతం పెరగనున్నాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో.. 2 రోజులగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు రద్దీ పెరిగింది. ఈ క్రమంలో సర్వర్లు మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలిగింది. సర్వర్ల మొండికేయడంతో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.