Tirupati : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వరస్వామి కోసం దర్శన భాగ్యం తోపాటు సేవ చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తుంటారు. భక్తులు ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోరు. ఏదో రకంగా గోవిందుడి సేవలో గడపాలని కోట్లమంది భక్తులు భావిస్తుంటారు. స్వామికి పట్టువస్త్రాలు, కానుకలు భక్తితో సమర్పిస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే శ్రీవారి జోడు పంచెలకు ఒక విశిష్టత ఉంది . తిరుమల ఆలయంలో పాటిస్తున్న ఎన్నో ఆచారాలు , పద్దతులు వందల ఏళ్లుగా వస్తున్నాయి. వాటిని తూచా తప్పుకుండా పాటిస్తున్నారు. అందులో భాగంగానే జోడు పంచెలు సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి మూలావిరాట్టు ధరించే ఏరువాడ జోడు పంచెలు కేవలం గద్వాల నుంచి వచ్చినవి మాత్రమే వినియోగిస్తున్నారు. దాదాపు నాలుగు వందల ఏళ్లుగా గద్వాల నుంచి జోడు పంచెల్ని స్వామి వారికి బహూకరిచే సంప్రదాయం కొనసాగుతోంది. గద్వాల సంస్థానం ఏర్పడినప్పటి నుంచి ఈ ఆచారం మొదలైంది. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ధ్వజారోహణం సందర్బంలో జోడు పంచెలను మూలమూర్తికి అలంకరిస్తారు. ఏడాదంతా వీటిని మూలవిరాట్టుకు వినియోగిస్తారు. ప్రతీ శుక్రవారం మాత్రం వీటిని శుభ్రం చేసి మళ్లీ స్వామి వారికి అలంకరించే సంప్రదాయ ఇప్పటికీ కొనసాగుతోంది. .
చేనేత కార్మికులు నిష్టతో ఈ పంచెలు తయారు చేస్తుంటారు. ఏ చిన్న తేడా వచ్చినా పని జరగదని కార్మికులు చెబుతుంటారు. జోడు పంచెలు తిరుమలకి చేరినప్పుడు ఆ సంగతిని ప్రధానపూజారి స్వామి చెవిలో చెప్పి జాగ్రత్త చేసి బ్రహ్మోత్సవాల రోజున బయటకి తీస్తారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు స్వామికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు. వాటిని స్వామికి అలంకారంగా మాత్రమే వినియోగిస్తారు. గద్వాల సంస్థానం నుంచి జోడు పంచెలు మాత్రం శ్రీవారి మూల విరాట్టుకి అలంకరిస్తారు..