Social Media Effect : ఈరోజుల్లో పిల్లలపై, యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంత..? ఇది పూర్తిగా అంతుచిక్కని ప్రశ్న అని చెప్పలేము. అలా అని కొలమానం ఉన్న ప్రశ్న అని కూడా చెప్పలేము. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా యూకేకు చెందిన శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం వారు డిజిటల్ టెక్నాలజీలపై ప్రత్యేకంగా ఒక స్టడీ మొదలుపెట్టారు.
డిజిటల్ టెక్నాలజీ.. అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియా యూత్పై చూపిస్తున్న ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు శాస్త్రవేత్తలు. చాలామంది ఇప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికి సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతీ విషయాన్ని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. ముఖ్యంగా యూత్.. ఇదంతా నమ్మడం చాలా కామన్గా మారిపోయింది.
ముఖ్యంగా 10 నుండి 24 మధ్య వయసు ఉన్నవారు సోషల్ మీడియా వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని శాస్త్రవేత్తలు తేల్చారు. దీని గురించి తెలుసుకోవడం కోసం పలువురు నిపుణులు ఒక యాప్ను తయారు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. గేమ్స్ వల్ల, సోషల్ మీడియా వల్ల మనిషి మానసికంగా ఎలా ప్రభావితం అవుతున్నారు అనే విషయాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఇదంతా ఏఐ సాయంతో సాధ్యమని వారు తెలిపారు.
ఇలా తయారు చేయబడిన యాప్.. ఒక గేమ్ రూపంలో ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ గేమ్ను ఆడుతున్నప్పుడు వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. సైకాలజీతో టెక్నాలజీ కలిసినప్పుడు ఇలాంటివి సాధ్యపడతాయని తెలిపారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్తలు వల్ల ఎలాంటి ఒత్తిడికి లోనవుతారని అనే విషయంపై కూడా వారు పరిశోధనలు చేయనున్నారు. ఇందులో సైబర్ బుల్లింగ్ కూడా ఒక భాగమన్నారు.
టీనేజ్లో ఉన్నవారికి, యువతలో ఉన్నవారికి సైబర్ బుల్లింగ్ అనేది పెద్దగా అర్థం కాదని, దాని వల్ల కూడా వారు ఒత్తిడికి లోనవుతారని బయటపడింది. సైబర్ బుల్లింగ్ అనేది పూర్తిగా వారి మానసిక స్థితిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వల్ల యువతపై పడుతున్న ప్రభావాన్ని, దాని వల్ల వారు ఎదుర్కుంటున్న సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకొని, దానికి పరిష్కారాలు కనుక్కోవాలని యూకే శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.