Cyber Security : వినోదంతో కొత్త విషయాలను తెలుసుకోవడం ఎవరికైనా ఆసక్తికరంగానే ఉంటుంది కదా.. అందుకే శాస్త్రవేత్తలు కూడా కొత్త కొత్త టెక్నాలజీ సాయంతో మనుషులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్నాలజీలపై అవగాహన లేకపోవడం వల్లే ఎన్నో క్రైమ్స్ కూడా జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే సైబర్ క్రైమ్స్ను తగ్గించడం కోసం, ఆ విషయంలో అవగాహన కల్పించడానికి ‘సైబర్ డిఫెండర్’ అనే మెటావర్స్ ప్లాట్ఫార్మ్ను క్రియేట్ చేశారు హాంగకాంగ్ శాస్త్రవేత్తలు.
హాంగ్ కాంగ్ పోలీసులలోని సైబర్ సెక్యూరిటీ వింగ్.. సైబర్ డిఫెంటర్ అనే కొత్త మెటావర్స్ ప్లాట్ఫార్మ్ను లాంచ్ చేశారు. ఇది ప్రజలకు సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది. డిజిటల్ ప్రపంచంలో ఉండే ఛాలెంజ్లను ఎదుర్కోవడం కోసం, అందులో వచ్చే సమస్యలను గుర్తించడం కోసం ఈ ప్లాట్ఫార్మ్ను ప్రారంభించినట్టు తెలిపారు. టెక్నాలజీతో క్రైమ్ పెరగడం మాత్రమే కాదు.. దాని సాయంతో క్రైమ్ను అడ్డుకోవడం కూడా సాధ్యమే అని వారు నిరూపించాలని అనుకుంటున్నారు.
అసలు మెటావర్స్ అంటే ఏంటి తెలుసుకోవడం కోసం సైబర్ డిఫెండర్ ప్లాట్ఫార్మ్ లాంచ్ సమయంలో మెటావర్స్ గురించి కూడా అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్స్ వల్ల ఆర్థికంగా కూడా హాంగ్ కాంగ్ నష్టపోయిందని, అందుకే ఇలాంటి ఒక ప్లాట్ఫార్మ్ ద్వారా ప్రజలకు మాత్రమే కాకుండా డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కూడా టెక్నాలజీపై అవగాహన కల్పించాలని హాంగ్ కాంగ్ శాస్త్రవేత్తలు ఇలాంటి ఒక కొత్త ప్రయత్నంతో ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
గత కొన్నేళ్లలో సైబర్ క్రైమ్స్ వల్ల ప్రజలు కోల్పోయిన ఆస్తుల గురించి ఈ ఈవెంట్లో పోలీసులు బయటపెట్టారు. కేవలం 2023లోనే ఇప్పటివరకు సైబర్ క్రైమ్స్ ద్వారా, లేదా వర్చువల్ ఆసెట్స్ పరంగా హాంగ్ కాంగ్ ప్రజలు 570 మిలియన్ డాలర్లు కోల్పోయారని వారు తెలిపారు. అంతే కాకుండా ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటివరకు ఈ విషయంపై 663 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2022తో పోలిస్తే 2023లో సైబర్ నేరాలు 75 శాతం పెరిగిపోయాయని అన్నారు. అందుకే సైబర్ డిఫెండర్ అనేది ఈ క్రైమ్ రేట్ను తగ్గిస్తుందని వారు భావిస్తున్నారు.