Child Missing News(Latest news in Andhra Pradesh) : ఊహించని విధంగా తప్పిపోయిన ఓ చిన్నారి.. ఏడేళ్ల తర్వాత కన్న తల్లిదండ్రుల దగ్గరకు చేరిన ఘటన ఆ కుటుంబంలో ఆనందం నింపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో 2016లో అక్ష అనే చిన్నారి తండ్రితో పాటు కనిపించకుండా పోయింది. కొన్నిరోజులు వెతికిన తర్వాత సఖినేటిపల్లి PSలో.. తల్లి ద్వారక ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పాప కోసం తల్లి ద్వారక వెతుకుతూనే ఉంది. ఎక్కడెక్కడో తిరిగిన చిన్నారి కరీంనగర్ చేరుకుంది. సైదాపూర్ మండలంలో భాగ్యలక్ష్మి అనే మహిళ దగ్గర పాపను అనుమానస్పదంగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని కరీంనగర్లోని బాలరక్షాభవన్ కు పోలీసులు అప్పగించారు.
చిన్నారి తప్పిపోయిన విషయాన్ని బిగ్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. పాప ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చూసి తమ బిడ్డే అంటూ వేర్వేరు ప్రాంతాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో పద్మ అనే మహిళ తన మనవరాలేనంటూ ఆధారాలు చూపించడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పద్మ చెప్పింది నిజమేనని నిరూపించుకున్న తర్వాత పాప తల్లి ద్వారకను పిలిపించారు. తనతో గొడవపడిన భర్త రవి పాపని తీసుకొని వెళ్ళిపోయాడని ద్వారక తెలిపింది. పాప కోసం రవి కూడా రావటంతో పాప సమక్షంలోనే ఏడేళ్ల తర్వాత భార్యాభర్తలు కలిసిపోయారు. అన్ని ఆధారాలు ధ్రువీకరించుకున్న తర్వాత పాపను అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇంతటితో కథ సుఖాంతం అయ్యింది. కానీ.. పూర్వాపరాలు పరిశీలిస్తే.. తొమ్మిదేళ్ల బాలిక అక్ష కోసం పోలీసులు తీవ్రంగానే శ్రమించారు. 2016లో రెండేళ్ల పాప మిస్సింగ్ అని నమోదైన కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు.. ఎఫ్ ఐఆర్ ఆధారంగా ముమ్మర గాలింపు చేశారు. మీడియాలో వస్తున్న కథనాలు చూసి మా పాపే అంటూ పోలీసులను ద్వారక ఆశ్రయించారు. పాపను తన భర్త రవి తీసుకెళ్లాడని….ఇప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడో తెలియదని పోలీసులకు తెలిపింది. చిన్నారిని వారి తల్లిదండ్రులని కలపాలని బిగ్ టీవీ ప్రయత్నాలు చేసింది. అక్ష.. ఎక్కడ నుంచి సైదాపూర్ వచ్చిందని తెలుసుకొనే ప్రయత్నం చేసింది.
సైదాపూర్ కు చెందిన భాగ్యలక్ష్మి కి… హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో పని చేస్తున్న అండాళ్లుతో పరిచయం ఏర్పడింది. అండాళ్లు దగ్గర అక్షను చూశానని భాగ్యలక్ష్మి తెలిపింది. తన తమ్ముడి బిడ్డగా పరిచయం చేసిందని… పాప తల్లి చనిపోయిందని ఆండాళ్లు చెప్పినట్లుగా.. భాగ్యలక్ష్మి పోలీసులకు తెలిపింది. పాప వీడియో వైరల్ కావడంతో తన కూతురే అంటూ శ్రీకాకుళం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని రుజువులు అడగ్గా.. వారు సంబంధం లేని విషయాలు చెప్పటంతో వారికి పాపను అప్పగించలేదు. చివరకు.. అక్ష కోసం ఆమె తల్లి వచ్చి.. అన్ని వివరాలూ తెలపగా.. నిర్దారించుకున్న పోలీసులు… ఆమెకు చిన్నారిని అప్పగించారు. ఇదే సమయంలో పాపతో పాటు ఆమె తండ్రి.. రవి కూడా రావటం.. ముగ్గురూ ఒకేచోట కలుసుకోవటంతో కథ సుఖాంతం అయ్యింది.