Sr NTR political career(Andhra Pradesh today news) : కథానాయకుడిగా తెరపై సంతృప్తి పరిచిన ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఓ సంచలనం. సామాన్యుడికి రాజకీయ ఫలాలు, సంక్షేమం దక్కినప్పుడే అసలైన సంతృప్తి అనే సిద్దాంతం ఆయనది. అందుకే తెలుగోడి ఆత్మగౌరవం ఆయన నినాదమైంది. రాష్టంలోనే కాదు.. దేశ రాజకీయాలు కూడా తెలుగోడు మార్చగలడని రుజువైంది.
1980వ దశకం వరకు దక్షిణ భారతీయులంతా మదరాసీలే అనే భావం దేశంలో ఉండేది. దీంతో మదరాసీ ముద్ర నుంచి తెలుగు వాడిని వేరుచేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. తెలుగువాడి స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటాలనుకున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ అస్థితర కూడా తోడైంది. దీంతో ఎన్టీఆర్ ఎంచుకున్న మార్గమే తెలుగుదేశం పార్టీ.
నిజానికి ఎన్.టి.రామారావు తనలోని రాజకీయ నాయకుడిని ఎప్పుడూ దాచుకోలేదు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లను స్థాపించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కృషి చేశారు. పలు సందర్భాల్లో సినీ పరిశ్రమకు, ప్రభుత్వాలకు మధ్య నిలిచి సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారు.
అయితే 1978లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల అపకీర్తిని మూటగట్టుకుంది. కేవలం ఐదేళ్ల కాలంలోనే నలుగురు ముఖ్యమంత్రులు మారడం రాష్ట్ర పాలనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన ఎన్టీఆర్.. తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.
తనను ఆదరించిన తెలుగు ప్రజలకు సేవ చేయాలనేదే నందమూరి తారకరాముడి ఏకైక లక్ష్యం. ఆ లక్షాన్యి సాధించేందుకు ఆయన ఎంచుకున్నదే తెలుగు దేశం పార్టీ. 1982 మార్చి 29న కొత్త పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి.
సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయకతప్పలేదు. ప్రజలను చైతన్య పరిచేందుకు ‘చైతన్యరథం’ ఎక్కి ప్రచార యాత్రను సాగించారు. చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ముందుకు కదిలారు. ఆయన సామాన్యులను సంబోధించిన విధానం ఓ ట్రెండ్ ను సెట్ చేసింది.
ఎన్టీఆర్ ఉద్వేగ భరితం, ఉద్రేక పూరిత ప్రసంగాలు తెలుగు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని మాత్రమే కాదు ఆవేశాన్ని, ఆలోచనను రగిలించాయి. రాజకీయాల్లో అప్పటి వరకు లేని ఓ కొత్త ఒరవడికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. పార్టీలకు ప్రత్యేకంగా గీతాలు రాయించుకునే సంస్కృతి టీడీపీతోనే మొదలైంది.
1983 జనవరి 7న వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. భారతీయ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 294 స్థానాల్లో తెలుగుదేశం – 199, కాంగ్రెస్ 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్టీఆర్ గుడివాడ, హిందూపూర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయం అపూర్వం. రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైంది. ఈ నిర్ణయాల కారణంగా ఎన్టీఆర్పై ఏర్పడిన ప్రజాభిమానం చాలా వేగంగా తగ్గిపోయింది.
ఎన్టీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అమెరికాకు వెళ్లగా.. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఠాకూర్ రామ్ లాల్ ఆయనను పదవి నుండి తొలగించారు. 1984 ఆగష్టు 16 న అప్పటి గవర్నర్ రాంలాల్ తో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లిన ఎన్టీఆర్ కు ప్రతిపక్షాలు కూడా మద్దతిచ్చాయి. ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.