Liger : విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ డిజాస్టర్ అయ్యింది. పెట్టిన పెట్టుబడి రాకపోవటం, నష్టాల బారిన పడటంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పూరిని కలిసి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన ఏదో ఇస్తానని అన్నాడు. నెల రోజుల సమయం కూడా అడిగాడు. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ ఇంటి ముందు అక్టోబర్ 27న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన పూరి వారిపై తన పరువు తీస్తే ఒక్క పైసా కూడా ఇవ్వనంటూ ఓ రేంజ్లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా లైగర్ వివాదం మరో మలుపు తీసుకుంది. ఫైనాన్సియర్ శోభన్ బాబు, డిస్ట్రిబ్యూటర్స్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు పూరి కంప్లైంట్ ఇచ్చాడు. పూరి ఇలా చేస్తాడని వారు అస్సలు ఊహించలేదు. దీంతో శోభన్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పూరిపై గుర్రుగా ఉన్నారు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులను తీసుకుంటుందో చూడాలిక.
పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ ఊహించని రీతిలో పరాజయాన్ని చవి చూసింది. అప్పటి నుంచి సెటిల్మెంట్ వివాదం నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. పూరి కూడా మీడియాకు దూరంగా సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వ్యవహారం మీడియాకెక్కింది. ఇప్పుడు మరి ఫైనాన్సియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.