Tirumala Srivari Temple : ఉత్తర తెలంగాణ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేరువ కాబోతోంది. మే 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి కరీంనగర్ లో 10 ఎకరాలు కేటాయించింది. ఈ భూమిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈనెల 31న ఉదయం 7గం.26 నిమిషాలకు వేదమంత్రోచ్ఛారణలతో టీటీడీ ఆలయ భూమి పూజ, శంకుస్థాపన చేస్తారు. అదే ప్రాంగణంలో సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. పది ఎకరాల్లో 20 కోట్లతో అత్యంత సుందరంగా శ్రీవారి ఆలయాన్ని నిర్మించబోతున్నారు.
ఆలయ నిర్మాణానికి అనుమతి పత్రాలు ఇప్పటికీ టీటీడీకి అందించారు.ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్ లో ఈ ఆలయాన్ని నిర్మిస్తారు. ఈనెల 31న కరీంనగర్ లో టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితుల ఆధ్వర్యంలో ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీనివాసుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించచనున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల నుంచి మూడు ఏనుగులను తెప్పించి నగరంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. తిరుమల తిరుపతి ఆలయం మాదరిగానే ఇక్కడ కూడా అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాలు ఉంటాయి. మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం నిర్మిస్తారు.
సుదూర ప్రాంతాల నుంచి తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల ఏటా పెరుగుతూనే ఉంది. అయినా కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసం టీటీడీ దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆలయాలు నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు చేపట్టింది.హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఇప్పటికే బ్రహ్మాండంగా గోవిందుడి ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్ , అమరావతి, తదితర ప్రాంతాల్లో ఆలయాల ను నిర్మించామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణ పనులు కూడా మొదలుకానున్నాయి. జమ్ములోని మజీన్ గ్రామం లో నిర్మిస్తున్న వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న ముహూర్తం నిర్ణయించారు.