Google : నాలుగు రోజుల వ్యవధిలో 2,274 కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధింపుపై గూగుల్ స్పందించింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయాలను అనుసరించి… ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమీక్ష జరుపుకుంటున్నామని గూగుల్ వెల్లడించింది. తమ విధానాలు డిజిటల్ ఇండియాకు సహకరించేలా ఉన్నాయని పేర్కొంది.
తన యూజర్లు, డెవలపర్లకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని గూగుల్ ప్రకటించింది. డిజిటల్ కార్యకలాపాల విస్తరణలో గూగుల్ చేపట్టిన చర్యలు ఎంతో ఉపయోగపడ్డాయని వివరించింది. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే అందించే… టెక్నాలజీ, యూజర్ సేఫ్టీ, ఆప్షన్స్ ద్వారా భారతీయ డెవలపర్లు ప్రయోజనం పొందారని… ఖర్చులను తక్కువగా ఉంచడం వల్ల తమ మోడల్ భారతదేశ డిజిటల్ పరివర్తనకు శక్తినిచ్చిందని…. కోట్ల మందికి డిజిటల్ సాధనాలను చేరువచేసిందని గూగుల్ చెప్పుకొచ్చింది.
ప్లే స్టోర్ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ… కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాలుగు రోజుల వ్యవధిలో గూగుల్ కు భారీగా జరిమానా విధించింది. తొలుత 1,337 కోట్లకు పైగా… ఆ తర్వాత 936 కోట్లకు పైగా జరిమానా విధించింది. జరిమానాతో పాటు థర్డ్-పార్టీ బిల్లింగ్/యాప్ల కొనుగోలు కోసం… చెల్లింపు సేవలను వినియోగించుకోకుండా యాప్ డెవలపర్లను అడ్డుకోరాదని సీసీఐ సూచించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాలని… నిర్దేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాలని CCI గూగుల్ను ఆదేశించింది.