Congress: కాంగ్రెస్లో కొందరు కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. పార్టీ అంతర్గత విషయాలు కేసీఆర్కు ముందే తెలుస్తున్నాయి. గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పార్టీలో కాక రేపింది. చాలామంది సీనియర్లు భుజాలు తడుముకున్నారు. ఆ కోవర్టులు ఫలానా ఫలానా అంటూ సోషల్ మీడియాలో రచ్చ నడిచింది. కట్ చేస్తే, లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీలో కోవర్టులెవరూ లేరని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు అదే రేవంత్రెడ్డి. పార్టీ కోసం, ప్రజల కోసం తాను 10 మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉన్నట్టు మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేస్తే కర్ణాటక తీర్పే తెలంగాణలోనూ వస్తుందని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది.
రేవంత్ రోజురోజుకీ రాటు దేలుతున్నారు. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతున్నారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు. సీఎం కేసీఆర్పై దాదాపు ప్రతీరోజూ ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉన్నారు. సర్కారు అరాచక చర్యలను ఎప్పటికప్పుడు మీడియా ముందు ఎండగడుతున్నారు. తాజాగా, 111 జీవో రద్దు వెనుక ఉన్న అక్రమాలను ప్రజల ముందుంచారు.
ప్రభుత్వంపై పోరు పర్ఫెక్ట్గానే సాగుతోంది. కాస్త కష్టపడితే కర్నాటక ఫలితాలు సాధించొచ్చని ఫిక్స్ అయ్యిపోయారు. అందుకే, పార్టీనీ చక్కబెట్టుకుంటున్నారు. నల్గొండలో నిరుద్యోగ సభ నిర్వహించి.. సీనియర్లందరితో కలిసిపోయారు. సరూర్ నగర్ సభ, యూత్ డిక్లరేషన్తో కాంగ్రెస్ సత్తా చాటారు. ఇక, కర్నాటక గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో.. పార్టీని బలోపేతం చేసేందుకు, తనతో ఏదైనా ఇష్యూలు ఉంటే 10 మెట్లైనా దిగుతానంటూ.. తనలోని అసలైన నాయకత్వ లక్షణాలను చాటుతున్నారు రేవంత్రెడ్డి. పొంగులేటి, జూపల్లి, ఈటల, కొండా, వివేక్.. తదితరులను కాంగ్రెస్లో చేరాలంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చి సంచలనంగా నిలిచారు. తాజాగా కాంగ్రెస్లో కోవర్టులు ఎవరూ లేరని రేవంత్ ప్రకటించడం.. వెంటనే మధు యాష్కీ ఆ వ్యాఖ్యలను స్వాగతించడం విశేషం.
హైదరాబాద్, గాంధీభవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్త్రృత స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. యూత్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై చర్చించారు. ఇకపై ప్రియాంక గాంధీ తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారని.. రెగ్యులర్గా రాష్ట్ర పర్యటనకు వస్తారని ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.