Sarath Babu: శరత్బాబు మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటున్నారు. శరీరం విషతుల్యమై అనేక భాగాలు పూర్తిగా డ్యామేజీ కావడంతో తుదిశ్వాస విడిచారు. 250కి పైగా సినిమాలతో అలరించిన శరత్బాబు సినీ ప్రస్థానం ఆసక్తికరంగా మొదలైంది.
శరత్బాబు కుటుంబానికి ఆమదాలవలసలో ఓ హోటల్ ఉండేది. కాలేజ్ చదువు పూర్తి అవగానే.. అన్నయ్యకు తోడుగా హోటల్ పనులు చూసుకునే వారు. అయితే, అప్పటికే నాటకాల్లో మంచి పేరు రావడంతో.. శరత్బాబును మద్రాసు వెళ్లి సినిమాల్లో నటించాలంటూ అతని స్నేహితులు బలవంతం చేసేశారు. దీంతో మద్రాస్ చేరుకుని సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు శరత్బాబు.
రామా విజేత ప్రొడెక్షన్స్ వారు కొత్త హీరో కావాలని ప్రకటన ఇవ్వడంతో ఆడిషన్కు వెళ్లారు. సుమారు 3వేల మంది ఆడిషన్కు రాగా.. అందులో శరత్బాబు ఎంపికయ్యారు. జగ్గయ్య, ఎస్.వి.రంగారావు, చంద్రకళ, సావిత్రి.. ఇలా టాప్ హీరోలతో కలిసి శరత్బాబు నటించిన మొదటి సినిమా “రామరాజ్యం”. 1973లో రిలీజై హిట్ సాధించింది. ఫస్ట్ మూవీతోనే శరత్బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
హీరోగా ఫస్ట్ సినిమానే హిట్ అయితే.. ఎవరైనా ఏం చేస్తారు? వరుసబెట్టి హీరోగా చేస్తారు. కానీ, శరత్బాబు అలా కాదు. రెండో సినిమాలో విలన్గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1974లో విడుదలైన ‘నోము’లో ప్రతినాయకుడిగా మెప్పించారు. ఆ తర్వాత ఏడాది ‘అభిమానవతి’లోనూ విలనే. దీంతో వరుసగా విలన్ ఛాన్సెస్ రావడం.. నటించడం జరిగిపోయింది. ఓ సందర్భంలో నెగటివ్ క్యారెక్టర్స్ చేసి చేసి ఆయనకే విసుగొచ్చిందట.
కట్ చేస్తే, బాలచందర్ మళ్లీ ఆయన్ను హీరోను చేశారు. బాలచందర్ డైరెక్షన్లో ‘నిళిల్ నిజమా గిరదు’ అనే తమిళ సినిమాలో హీరోగా చేశారు. అందులో కమల్హాసన్, అనంత్, శరత్బాబు.. ముగ్గురు హీరోలు. ఆ సినిమా సూపర్హిట్. ఇక, వరుసబెట్టి తమిళ సినిమాలు చేశారాయన. బాలచందర్ తీసిన సినిమాలన్నింటిలోనూ ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు. ‘సాగర సంగమం’లో కమల్ హాసన్ ఫ్రెండ్గా శరత్బాబు మెప్పించారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఆరు భాషల్లో హీరో, విలన్, సహాయనటుడిగా 250కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల తర్వాత.. టీవీ సీరియల్స్లోనూ నటించి అలరించారు. అనారోగ్యంతో ప్రేక్షకులకు శాశ్వతంగా దూరమై.. తన సినిమాలతో చిరంజీవిగా మిగిలిపోయారు శరత్బాబు.