Music Director Raj death reason(Latest Tollywood News) : తెలుగు సినీ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన సంగీత ద్వయం రాజ్-కోటి . వారిలో రాజ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్లోని తన నివాసంలో ప్రాణాలు కోల్పోయారు.
రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజ్ మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు. రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజ్-కోటి ద్వయం దశాబ్దాలపాటు సినీప్రియులను తమ సంగీతంతో అలరించింది. 1983లో ప్రళయ గర్జన మూవీతో వీరిద్దరూ తొలిసారి కలిసి పనిచేశారు. ఈ ద్వయం సంగీతం అందించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 150కుపైగా సినిమాలకు ఇద్దరూ కలిసి పనిచేశారు. ముఠామేస్త్రి, బావా బావమరిది, గోవిందా గోవిందా, హలోబ్రదర్ లాంటి సినిమాలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 90వ దశకంలో రాజ్- కోటి జంటకు మంచి డిమాండ్ ఉండేది.
కోటి నుంచి విడిపోయిన రాజ్ సొంతంగా కొన్ని చిత్రాలకు మ్యూజిక్ అందించారు. సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరాకు నేపథ్య సంగీతం అందించారు. కొన్ని సినిమాల్లో రాజ్ అతిథి పాత్రల్లోనూ మెరిశారు.
రాజ్ తండ్రి తోటకూర వెంకటరాజు పలు తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మద్రాసులో ఇద్దరూ కలిసి ఉండేవారు. తండ్రిబాటలో రాజ్ కూడా సంగీత దర్శకుడు అయ్యారు.