BRS MLA : సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు రెచ్చిపోయారు. దళిత బంధు లబ్ధిదారులపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అడ్వకేట్ యుగేందర్పై దాడికి తెగబడ్డారు. తిరుమలగిరి మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ దళిత బంధు పథకం చేపట్టారు.
ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు దళిత బంధు నిధులను దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనికి కౌంటర్ గా ఓ సభలో “కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్, అఖిలపక్ష కొడుకులకు దళిత బంధు అందిందంటూ” ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అడ్డగూడూరుకు చెందిన అడ్వకేట్ యుగేందర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దీంతో కిషోర్ అనుచరులు కారు అద్దాలు పగులగొట్టి, కర్రలతో తనపై దాడి చేశారని యుగేందర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడిలో గాయపడ్డ అడ్వకేట్ యుగేందర్ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని కాంగ్రెస్ నేతలు వెళ్లి కలిశారు. అనంతరం రేవంత్తో ఫోన్ లో మాట్లాడించారు. దాడి జరిగిన తీరును టీపీసీసీ అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నేతల గుండాయిజంపై ఫైర్ అయ్యారు. అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని యుగేంధర్ కు భరోసా ఇచ్చారు. న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు రేవంత్రెడ్డి.
ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో స్వయంగా సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలు దళిత బంధులో వాటాలు తీసుకున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడితే సహించని కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు దళిత బంధులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అనుచురులు దాడికి తెగబడటం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ దాడి ఘటనపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందనే చర్చ నడుస్తోంది.