Radha Murder Case : కారుతో తొక్కించి.. బండరాళ్లతో మోది.. సిగరెట్లతో కాల్చి ఓ మహిళను దారుణంగా హతమార్చిన కేసు కీలక మలుపు తిరిగింది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ శివారులో కోట రాధ అనే వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. భర్తే ఆమెను కిరాతకంగా హతమార్చినట్లు తెలుస్తోంది.
రాధ వద్ద అప్పు తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డి డబ్బు ఇస్తాను.. రమ్మని పిలిపించి కిరాతకంగా అంతమొందించి ఉంటాడనే అనుమానాలు తొలుత రేకెత్తాయి. రాధ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అతని కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. రాధ అంత్యక్రియలు సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఆ వెంటనే ఆమె భర్త, సాఫ్ట్వేర్ ఇంజినీర్ కోట మోహన్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లాకు తరలించినట్టు సమాచారం.
రాధను ఆమె భర్త మోహన్రెడ్డే మరికొందరితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితుడికి 80 లక్షల వరకు అప్పు ఇవ్వడం, ఆ మొత్తం తిరిగి రాకపోవడంతో భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందంటూ మోహన్రెడ్డి అనుమానించాడు.
కాశిరెడ్డి పేరిట సిమ్ కార్డులు కొనుగోలు చేసి, అతని పేరుతోనే తన భార్యతో సెల్ఫోన్లో మోహన్రెడ్డి ఛాటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. డబ్బులిస్తామని అతని పేరుతోనే సందేశం పంపి ఈ నెల 17న ఆమెను స్వగ్రామం నుంచి కనిగిరి రప్పించాడు. అనంతరం రాధను కారులో తీసుకెళ్లి తీవ్రంగా హింసించి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు.
కనిగిరిలోని పామూరు బస్టాండు సెంటరులో వేచి ఉన్న రాధ వద్దకు వచ్చిన ఎరుపు రంగు కారు హైదరాబాద్కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భార్య హతమైన తర్వాత మోహన్రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతని పాత్రపై అనుమానాలు రేకెత్తి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
తన స్నేహితుడికి ఇచ్చిన అప్పు విషయంలో వేధింపులు తాళలేక తన తల్లిదండ్రులు, బంధువుల వద్ద నుంచి 25 లక్షలు తీసుకెళ్లి భర్తకు రాధ ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో అప్పు తీసుకున్న కేతిరెడ్డి కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో తొలుత కేసు దర్యాప్తులో అందరి దృష్టి అతని వైపే మళ్లింది. రాధ హత్యలో మోహన్రెడ్డికి సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.