Drinking water: తాగునీరు అనేది అందరికీ అందుబాటులో ఉండాల్సిన హక్కు. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఈ హక్కు కూడా దొరకడం లేదు. చాలామంది స్వచ్ఛమైన నీరు తాగలేకపోవడం వల్లే అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అన్న పేరుతో కలుషితమైన నీటిని కూడా విక్రయిస్తూ కొన్ని సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సూర్యకాంతితో కలుషితమైన నీటిని తాగునీటికి మార్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. తక్కువ ఖర్చుతో ఒక రీసైక్లెబుల్ పౌడర్ను వారు తయారు చేశారు. ఈ పౌడర్ అనేది నీటిలో కలిపి సూర్యకాంతిలో పెడితే.. ఎన్నోరకాల నీటిలో పెరిగే బ్యాక్టీరియాను చంపుతుందని చెప్తున్నారు. ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా తాగునీటి సౌకర్యం లేని 30 శాతం మందికి స్వచ్ఛమైన నీరు అందించేలా చేస్తుంది. నీటిలో ఉన్న బ్యాక్టీరియా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మరణాలు కూడా సంభవిస్తున్నాయని, ఈ ప్రక్రియ వల్ల ఆ మరణాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 2 మిలియన్ మంది నీటి సమస్యల వల్ల మరణిస్తున్నారు. అందులో చాలామంది 5 ఏళ్లకంటే చిన్నగా ఉన్నవారే. తాము చేసిన ఈ పరిశోధన ఎంతోమంది నీటి దాహాన్ని తీరుస్తుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నీటిలోని ఇన్ఫెక్షన్స్ తొలగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం నీటిలో ఉన్న బ్యాక్టీరియాను పోగొట్టడానికి పలు రకాల కెమికల్స్ అందుబాటులో ఉన్నా.. వాటి వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని వారు బయటపెట్టారు.
ప్రస్తుతం యూవీ ల్యాంప్స్తో నీటిలో ఇన్ఫెక్షన్స్ను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పౌడర్ను ఉపయోగిస్తే మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కేవలం నీటిలో ఉన్న బ్యాక్టీరియా, దాని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ మాత్రమే కాకుండా వైరస్లను కూడా దూరం చేస్తుందని తెలిపారు. నీటి వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాలు అన్ని ఈ పౌడర్ వల్ల దూరమయిపోతుందని అన్నారు.