NTR Statue: కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్. ఆ గెటప్ తెలుగువారి మదిలో నిలిచిపోయింది. తరం మారడంతో లేటెస్ట్ జనరేషన్కు ఇదంతా తెలీదు. అందుకే, ఎన్టీఆర్ను శాశ్వతంగా నిలిపేలా.. ఖమ్మం లకారం చెరువులో విగ్రహ ఏర్పాటుకు సిద్ధమయ్యారు మంత్రి పువ్వాడ అజయ్. విగ్రహ తయారీతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తవగా.. హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. అయినా, నిర్వాహకులు తగ్గేదేలే అంటున్నారు. విగ్రహానికి కాస్త మార్పులు చేసి ఆవిష్కరణకు రెడీ చేస్తున్నారు.
ఖమ్మం లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహానికి మార్పులు చేశారు. శ్రీకృష్ణుడు రూపంలోని ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరాలు రావడంతో.. విగ్రహానికి నీలి రంగు స్థానంలో గోల్డ్ కలర్ వేస్తున్నారు. కిరీటంలో నెమలి పింఛం, వెనుక విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగించారు. ముందు ప్రకటించిన విధంగానే ఈనెల 28న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు నిర్వాహకులు. మరి, ఇంతటి వివాదం తర్వాత ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? రారా? అనేది ఆసక్తికరంగా మారింది.
కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపైనే తమ అభ్యంతరం అంటున్నారు యాదవ సంఘాలు, కరాటే కల్యాణీ. ఖమ్మంలో బలమైన కమ్మ వర్గంను ఆకట్టుకోడానికే పువ్వాడ అజయ్ ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారనేది మరో విమర్శ. అయితే, నెల్లూరు నడిబడ్డున అలంకార్ సెంటర్లోనూ శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఉంది. చాలా రోజులుగా అది స్థానికులకు స్పూర్తిదాయకంగా నిలిచింది. మరి, ఆ విగ్రహం విషయంలో ఎలాంటి వివాదం లేదు. ఖమ్మంలో మాత్రం ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నందమూరి అభిమానులు. ఇదంతా రాజకీయ వివాదమే అంటున్నారు.